
కోచ్గా రవిశాస్త్రి సక్సెస్
టీమిండియా హెడ్ కోచ్ పదవి అత్యంత విలువైనది. చాలా కాలం పాటు బీసీసీఐ విదేశీ కోచ్లనే నమ్ముకున్నా.. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. 5-6 ఏళ్ల నుంచి స్వదేశీ కోచ్లనే నియమిస్తూ వస్తోంది. అనిల్ కుంబ్లే, రవిశాస్త్రిలు హెడ్ కోచ్లుగా నియమితులయ్యారు. వారి కాలంలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా రవిశాస్త్రి హెడ్ కోచ్ అయిన తర్వాత రెండుసార్లు ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించింది. ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల్లో కూడా విజయాలు సాధించింది. 2019 ప్రపంచకప్లో సెమీస్ చేరింది. ఇక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు కూడా చేరింది. రవిశాస్త్రి తన నాలుగేళ్ల పదవి కాలంలో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు.

ఐపీఎల్ జట్లతో చర్చలు
అయితే రవిశాస్త్రి పదవీకాలం ఈ ఏడాది చివర్లో యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచకప్తో ముగియనుంది. అంతేకాదు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ మరియు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ పదవీకాలం కూడా పూర్తవనుంది. ఇతర సహాయక సిబ్బంది ఇప్పటికే పలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్లతో చేరేందుకు చర్చలు కూడా జరుపుతున్నారట. రవిశాస్త్రి కూడా ఐపీఎల్ స్టార్ జట్లతో కలిసి పనిచేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

వ్యాఖ్యానం చేయనున్నాడా?
టీ20 ప్రపంచకప్ అనంతరం రవిశాస్త్రి కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. విశ్రాంతి అనంతరం రవిశాస్త్రి తన వ్యాఖ్యానంతో అభిమానులను అలరించనున్నాడట. ఏదేమైనా మరోసారి రవిశాస్త్రి టీమిండియా కోచ్ పదవి చేపట్టేందుకు సముఖంగా లేడు. 2014లో జట్టు డైరెక్టర్గా రవిశాస్త్రి ఎంపికయ్యాడు. 2016లో టీ20 ప్రపంచకప్ వరకు అదే పదవిలో కొనసాగాడు. ఆపై అనిల్ కుంబ్లే ఒక సంవత్సరం పాటు కోచ్ పదవి చేపట్టారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఉన్న విభేదాల కారణంగా కుంబ్లే తన బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. రవిశాస్త్రి కోచ్ పదవి చేపట్టాడు. రెండు సంవత్సరాలు విజయవంతమవ్వడంతో మరోసారి అతడినే కోచ్ పదవి వరించింది.


Click it and Unblock the Notifications












