
అది నా నిర్ణయం కాదు
'బ్యాటింగ్ ఆర్డర్లో రిషభ్ పంత్ను ముందుగా పంపించడం నా నిర్ణయం కాదు. పంత్ను ముందుకు పంపించినందుకు నేను ఘనత తీసుకోను. అడిలైడ్లో తొలి టెస్టు ఓడిపోవడంతో ఈ చర్చ మొదలైంది. విరాట్ కోహ్లీ, అజింక్య రహానేతో పాటు మేమంతా కలిసి మాట్లాడుకున్నాం. కోహ్లీనే ఈ ఆలోచనను ముందుగా పంచుకున్నాడు. ఇద్దరు ఎడమచేతివాటం ఆటగాళ్లను తీసుకుంటే.. పంత్ను ఐదో స్థానంలో పంపిస్తే బాగుంటుందన్నాడు. అలాగైతే కుడి-ఎడమ కూర్పును కొనసాగించొచ్చు' అని విక్రమ్ రాఠోడ్ తెలిపాడు.

అప్పుడు నేనే చెప్పా
'మేం మరికొంత సమయం ఆగాం. ఆరో స్థానంలోనే పంపిద్దామని అజింక్య రహానేతో చర్చించాం. అయితే సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో.. ఇదే సరైన సమయమని, అయిదో స్థానంలో బ్యాటింగ్కు పంపిచాలని చెప్పాను. ఆ నిర్ణయాన్ని అందరూ అంగీకరించారు. రవిశాస్త్రి దానికి ఎంతో మద్దతు ఇచ్చాడు. ఆయన ఎడమ-కుడి వాటం భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మన్కు ఆస్ట్రేలియా బౌలర్లు అంత తీవ్రతతో బౌలింగ్ చేయలేరని విశ్వసిస్తాడు' అని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ పేర్కొన్నాడు.

వరుసగా 97, 89 పరుగులు
గబ్బా టెస్టులో 328 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి రోజు భారత్ జట్టు 167/3తో నిలిచిన దశలో రిషబ్ పంత్ ఐదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. నిజానికి ఐదో స్థానంలో మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్కి వెళ్లాల్సి ఉండగా.. ఒక స్థానం ముందుకెళ్లిన పంత్ (89 నాటౌట్: 138 బంతుల్లో 9x4, 1x6) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకూ క్రీజులో నిలిచి టీమిండియాకి చారిత్రక విజయాన్ని అందించాడు. సిడ్నీ, బ్రిస్బేన్ టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్లో పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు రాగా.. రెండో ఇన్నింగ్స్లో అయిదో స్థానంలో బరిలోకి దిగాడు. వరుసగా 97, 89 పరుగులు చేశాడు.

సుందర్ కూడా హిట్టింగ్ చేయడంతో
చివరి టెస్టులో ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ వాషింగ్టన్ సుందర్ టీమ్లోకి రావడంతో.. విరాట్ కోహ్లీ ఆలోచన అమల్లోకి వచ్చింది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన పంత్.. ఆస్ట్రేలియా బౌలర్లని హడలెత్తించాడు. దీంతో కష్టమనుకున్న లక్ష్యాన్ని మరో 19 బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్నిఅందుకుంది. ఇక సుందర్ (22: 29 బంతుల్లో 2x4, 1x6) కూడా హిట్టింగ్ చేయడంతో పంత్పై కాస్త ఒత్తిడి తగ్గింది. దీంతో అతడు స్వేచ్ఛగా బ్యాట్ జులిపించాడు.


Click it and Unblock the Notifications

World Test Championship ఫైనల్ వాయిదా!!










