ఢిల్లీ: ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పోరు వాయిదా పడనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జూన్ 18 నుంచి 22 వరకు ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారని సమాచారం. ఇక జూన్ 23ను రిజర్వ్డేగా కొనసాగించనున్నారట. ఫైనల్ టెస్టు నిర్వహించే అయిదు రోజుల్లో వాతావరణం, మరే ఇతర కారణాలతో ఆటకు ఆటంకం ఏర్పడితే.. రిజర్వ్డే రోజు కూడా మ్యాచ్ను కొనసాగిస్తారు. అయితే వాయిదాపై ఐసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం లార్డ్స్ వేదికగా జూన్ 10 నుంచి 14 వరకు ఫైనల్ జరగాల్సి ఉంది.
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ తుది పోరును దృష్టిలో ఉంచుకొని తేదీల్లో మార్పులు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. అయితే ఐపీఎల్ 14వ సీజన్ షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పోరు వాయిదాపై ఐసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఎప్పుడు జరుగుతుందో చూడాలి. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చాక అసలు విషయం తెలుస్తుంది.
ప్రస్తుతం టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. తుది పోరుకు అర్హత సాధించడానికి భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో టీమిండియా (71.7%) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ (70%), ఆస్ట్రేలియా (69.2%), ఇంగ్లాండ్ (68.7%) వరుసగా ఉన్నాయి. పట్టికలో విజయాల శాతం అధికంగా ఉన్న మొదటి రెండు జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి.
కరోనా మహమ్మారి కారణంగా చాలా టెస్టు సిరీస్లు రద్దవడంతో చాంపియన్షిప్ పాయింట్ల విధానంలో ఐసీసీ మార్పులు చేసింది. సిరీస్లోని మొత్తం పాయింట్లలో.. ఓ జట్టు గెలిచిన పాయింట్ల శాతం ప్రకారం ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్లను నిర్ణయిస్తున్నది. ఏ టెస్టు సిరీస్కైనా 120 పాయింట్లు ఉంటాయి. ఉదాహరణకు భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్నే తీసుకుంటే.. గెలిస్తే 30, టై అయితే 15, డ్రాకు 10 పాయింట్లు జట్టు ఖాతాలో చేరుతాయి. ఇలా రెండింట్లో ఏ టీమ్ సిరీస్లో ఎక్కువ పాయింట్లను ఖాతాలో వేసుకుంటుందో ఆ జట్టుకు అధిక శాతం వస్తుంది. ఒకవేళ పాయింట్ల శాతం కూడా సమానమైతే చేసిన పరుగులు, పడగొట్టిన వికెట్ల ఆధారంగా శాతాలను ఐసీసీ లెక్కేస్తుంది.
షకీబుల్ అరుదైన రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్లో ఏకైక ప్లేయర్గా!!