నేను ఆడిన పరిస్థితులు భిన్నం..
2019 వన్డే ప్రపంచకప్లో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడిన విజయ్ శంకర్ గాయంతో టోర్నీ మధ్యలోనే ఇంటిదారిపట్టాడు. ఇక శంకర్ అంచనాలకు తగ్గ ప్రదర్శన చేయనపుడల్లా భారత క్రికెట్ అభిమానులు తన పేరు ముందు 'త్రీడీ' అనే పదం జోడించి ట్రోల్ చేస్తున్నారు. దీనిపై శంకర్ స్పందిస్తూ..'త్రీడీ పేరుతో నాకెలాంటి సంబంధం లేదు. ప్రపంచకప్ సమయంలో అభిమానులు నా పేరు ముందు 'త్రీడీ' అని తగిలించి వైరల్ చేశారు. ప్రపంచకప్లో మూడు మ్యాచ్లు ఆడా. మెరుగైన ప్రదర్శనే చేశా. నన్ను ప్రతిసారీ రాయుడితో పోలుస్తున్నారు. కానీ నేను ఆడిన బ్యాటింగ్ ఆర్డర్లు, పరిస్థితులు చాలా భిన్నం. ఎవరికీ ఇవేం పట్టవు'' అంటూ ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకర్ అసహనం వ్యక్తం చేశాడు.
ఇతరుల కన్నా బాగానే ఆడా..
ఐపీఎల్ 2021 సీజన్లోనూ విజయ్ శంకర్ పేలవ ప్రదర్శన కొనసాగింది. దాంతో అభిమానులు అతన్ని సోషల్ మీడియా వేదికగా ఉతికారేశారు. అయితే శంకర్ మాత్రం తన ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నానంటున్నాడు. చాలా మంది ఆటగాళ్ల కంటే మెరుగైన ప్రదర్శనే చేశానన్నాడు. 'ఐపీఎల్లో నా జట్టు తరఫున బౌలింగ్ బాగానే చేశా. బ్యాటింగ్ విషయానికి వస్తే నేను క్రీజులోకి దిగినప్పుడల్లా.. కొన్ని వికెట్లు పడి, నెట్ రన్రేట్ 10-12 మధ్య ఉంటోంది. ఇలాంటి సమయంలో పరుగులు సాధించడం అంత తేలిక కాదు. టీమిండియా తరఫున నేను బాగానే ఆడా. అయితే బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆల్రౌండర్ను కాబట్టి నేను జట్టులో ఉండాలి అనుకోవట్లేదు. నా సామర్థ్యాలను జనాలు నమ్మినప్పుడే నేను జట్టులోకి రావాలనుకుంటున్నా.
రన్రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు..
ఒకవేళ ఇతరులతో పోల్చాలి అంటే మాత్రం చాలా మంది ఆటగాళ్ల కంటే నేను మెరుగైన ప్రదర్శన చేశా. టీమిండియాలోకి తిరిగి రావడం గురించి ఆలోచించట్లేదు. అతి నా చేతుల్లో లేదు. దేశం కోసం ఆడినవాళ్లు ఎవరైనా మళ్లీ ఆ జెర్సీ ధరించాలని ఆశపడతారు. నాకు వచ్చిన అవకాశాలను అందుకుని రాణించినప్పటికీ నన్ను జట్టులో కొనసాగించలేదని నిరాశగా ఉంది. చివరగా న్యూజిలాండ్తో టీ20ల్లోనూ మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసి మంచి స్కోర్లు సాధించా. నేనాడిన 12 వన్డేల్లో 8 లేదా 9 సార్లు మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అందులో అయిదు సార్లు సాధించాల్సిన రన్రేట్ ఎక్కువగా ఉన్న సమయంలోనే క్రీజులోకి వెళ్లా'అని శంకర్ చెప్పుకొచ్చాడు.