విశాల్ జైస్వాల్.. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైన పేరు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్ను ఔట్ చేయడం ద్వారా ఈ కుర్రాడు టాక్ ఆఫ్ ది నేషన్గా మారాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్లను గుజరాత్ స్పిన్నర్ అయిన విశాల్ జైస్వాల్ పెవిలియన్ చేర్చాడు.
అద్భతమైన బంతితో విరాట్ కోహ్లీని బోల్తా కొట్టించిన విశాల్.. వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్ సాయంతో స్టంపౌట్గా పెవిలియన్ చేర్చాడు. స్టన్నింగ్ డెలివరీతో రిషభ్ పంత్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. విశాల్ జైస్వాల్ ధాటికి కోహ్లీ(77), రిషభ్ పంత్(70) శతకాలను చేజార్చుకున్నారు.
ఈ ఇద్దరితో పాటు ఢిల్లీ ఓపెనర్ అర్పిత్ రాణా(10), మిడిలార్డర్ బ్యాటర్ నితీష్ రాణా(12)లను కూడా విశాల్ పెవిలియన్ చేర్చాడు. మొత్తం నాలుగు వికెట్ల (4/42)తో ఢిల్లీ పతనాన్ని శాసించించాడు. విశాల్ ధాటికి ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 254 పరుగులకే పరిమితమైంది. కోహ్లీ, రిషభ్ పంత్లను ఔట్ చేసిన విశాల్ జైస్వాల్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

గుజరాత్కు చెందిన 27 ఏళ్ల విశాల్ జైస్వాల్.. దేశవాళీ క్రికెట్లో ఆ జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్, లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన విశాల్.. ఇప్పటి వరకు 16 టీ20లు, 12 లిస్ట్-ఏ మ్యాచ్లు, 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 2022 అక్టోబర్ ప్రొఫెషనల్ క్రికెట్ ప్రారంభించిన విశాల్.. అరంగేట్ర మ్యాచ్లో 9వ స్థానంలో గోల్డెన్ డక్ అయ్యాడు. ఆ మ్యాచ్లో బౌలింగ్ చేయలేదు. ఇప్పటి వరకు 64 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 40 వికెట్లు ఉన్నాయి. రెడ్ బాల్ క్రికెట్లో ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ఒక హాఫ్ సెంచరీ బాదాడు.