వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని సెంచరీతో మొదలెట్టిన కింగ్ కోహ్లీ.. రెండో మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గ్రౌండ్లో గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్తో 77 పరుగులు చేసాడు. గుజరాత్ బౌలర్ విశాల్ జైస్వాల్ బౌలింగ్లో స్టంప్ ఔటయ్యాడు. భారీ షాట్ ఆడేందుకు స్టెప్ ఔటైన కోహ్లీని వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్ స్టంపౌట్ చేశాడు. దాంతో విరాట్ కోహ్లీ సెంచరీ 23 పరుగుల దూరంలో చేజారింది.
అంతర్జాతీయ టెస్ట్లతో పాటు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ నిలకడైన ప్రదర్శనతో పరుగుల మోత మోగిస్తున్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లీ.. మూడో వన్డేలో(74*)అజేయ హాఫ్ సెంచరీతో ఫామ్ అందుకున్నాడు. అనంతరం సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో వరుసగా 135, 102, 65 నాటౌట్తో చెలరేగాడు.
అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ నయా రూల్తో విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన కోహ్లీ.. ఆంధ్ర జట్టుతో గత బుధవారం జరిగిన మ్యాచ్లో (131) సెంచరీతో చెలరేగాడు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ దేశవాళీ వన్డే టోర్నీ ఆడిన కోహ్లీ.. అద్భుత శతకంతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాడు.
ఈ మ్యాచ్కు ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో పాటు ప్రత్యక్ష ప్రసారం కూడా లేదు. దాంతో కోహ్లీ స్కోర్ కోసం నెటిజన్లు గూగుల్ను తెగ సెర్చ్ చేస్తున్నారు. బెంగళూరు అభిమానులు అయితే కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు మైదానం సమీపంలోని చెట్లు ఎక్కుతున్నారు.