తమిళనాడు బ్యాటర్ బాబా ఇంద్రజీత్ అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. తీవ్ర గాయమైనా.. జట్టు కోసం బ్యాటింగ్కు వచ్చి అందరి ప్రశంసలు అందుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హర్యానాతో బుధవారం జరిగిన సెమీఫైనల్లో బాబా ఇంద్రజీత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లే క్రమంలో బాబా ఇంద్రజీత్ గాయపడ్డాడని తమిళనాడు కెప్టెన్ దినేశ్ కార్తీక్ తెలిపాడు.
బొక్కబోర్లా పడటంతో బాబా ఇంద్రజీత్ పై పెదవి చిట్లిపోయింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పై పెదవికి కుట్లు వేసారు. ఈ గాయం నేపథ్యంలో అతను బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని భావించారు. కానీ బాబా ఇంద్రజీత్ ప్లాస్టర్ వేసుకొని మరి బ్యాటింగ్కు దిగాడు. జట్టు కోసం నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ను కొనసాగించాడు. పై పెదవి చిట్లిపోయినా.. కుట్లు పడ్డా ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్యాటింగ్ చేశాడు.

71 బంతుల్లో 5 ఫోర్లతో 64 పరుగులు చేసిన అతన్ని అన్షుల్ కంబోజ్..అంకిత్ కుమార్ సూపర్ క్యాచ్ సాయంతో పెవిలియన్ చేర్చాడు. గాయంతో బాబా ఇంద్రజీత్ బ్యాటింగ్ చేసినా తమిళనాడుకు విజయం దక్కలేదు. ఇక బాబా ఇంద్రజీత్ ప్లాస్టర్తో బ్యాటింగ్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. బాబా ఇంద్రజీత్ కమిట్మెంట్కు అభిమానులు, మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 293 పరుగులు చేసింది. హిమన్షు రాణా(118 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 116 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. యువరాజ్ సింగ్(79 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 65) హాఫ్ సెంచరీతో రాణించాడు. సుమిత్ కుమార్(30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తమిళనాడు బౌలర్లలో సాయి కిశోర్, వరుణ్ చక్రవర్తీ రెండేసి వికెట్లు తీయగా.. నటరాజన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన తమిళనాడు 47.1 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌటైంది. దాంతో 63 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. గాయంతో బ్యాటింగ్ చేసిన బాబా ఇంద్రజీత్(71 బంతుల్లో 5 ఫోర్లతో 64)టాప్ స్కోరర్గా నిలిచాడు. నారయణ్ జగదీషన్(55 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 30), కెప్టెన్ దినేశ్ కార్తీక్(35 బంతుల్లో 3 సిక్స్లతో 31) పర్వాలేదనిపించారు. హర్యానా బౌలర్లలో అన్షఉల్ కంబోజ్(4/30) నాలుగు వికెట్లు తీయగా.. సుమిత్ కుమార్, నిశాంత్ సిందు, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు. రాహుల్ తెవాటియాకు 2 వికెట్లు దక్కాయి.