సెంచరీ జస్ట్ మిస్..
జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 13 ఓవర్లు ముగిసే సమయానికి 49/4తో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో సూర్యకుమార్ యాదవ్ ( 75 బంతుల్లో 15 ఫోర్లతో 91) బాధ్యతాయుత ఇన్నింగ్స్తో ముంబై జట్టును ఆదుకోగా.. ఆ తర్వాత ఆదిత్య తారె (98 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 83)తో కలిసి శార్ధూల్ ఠాకూర్(57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 92) చెలరేగాడు. ఆరో వికెట్కు ఆదిత్య తారెతో కలిసి 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సెంచరీకి చేరువయ్యే క్రమంలో ఓ భారీ షాట్కు యత్నించిన శార్దూల్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. లిస్ట్-ఎ క్రికెట్లో అతనికిది తొలి హాఫ్ సెంచరీ.
భారీ విజయం..
శార్దూల్ భారీ ఇన్నింగ్స్తో ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాట్స్మన్ యశస్వి జైస్వాల్(2), పృథ్వీ షా(2), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(2) దారుణంగా విఫలమయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో రిషి ధావన్ నాలుగు వికెట్లు తీయగా.. పంకజ్ జస్వాల్ 3, వైభవ్ అరోరా, మయాంక్ దగర్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ 24.1 ఓవర్లలోనే 121 పరుగులకే కుప్పకూలి 200 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. ఇక 4 ఓవర్లు వేసిన ఠాకూర్ 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రశాంత్ సోలంకి నాలుగు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు.
పాండ్యాకు పోటీ..
వాస్తవానికి ఆసీస్ పర్యటనలో రాణించిన శార్దూల్ ఇంగ్లండ్తో నాలుగు టెస్ట్ల సిరీస్కు ఎంపికయ్యాడు. కానీ సీనియర్ బౌలర్ల రాకతో అతనికి తుది జట్టులో చోటు కష్టమైంది. దాంతో అతన్ని రిలీజ్ చేసిన బీసీసీఐ పరిమిత ఓవర్ల సిరీస్లకు ప్రాక్టీస్గా విజయ్ హజారే ట్రోఫీకి పంపించింది. ఇక ఇంగ్లండ్తో మార్చి 12 నుంచి ఐదు టీ20ల సిరీస్ అహ్మదాబాద్ వేదికగా జరగనుండగా.. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శార్ధూల్ ఠాకూర్కి కూడా చోటు లభించిన విషయం తెలిసిందే. శార్దూల్ బ్యాటింగ్లో ఇదే జోరు కనబరిస్తే.. పాండ్యా ప్లేస్కు ఎసరు ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గాయం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పాండ్యా బ్యాటింగ్లో అదరగొడుతున్నా.. బౌలింగ్ మాత్రం చేయడం లేదు.
ఆసీస్పై ఆల్రౌండర్ షో..
ఆస్ట్రేలియా పర్యటనలో బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో అనూహ్యంగా అవకాశాన్ని అందుకున్న శార్దూల్ ఆల్రౌండ్షోతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్లో టాపార్డర్ విఫలమైన వేళ.. మరో యువ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్తో కలిసి బాధ్యతాయుత హాఫ్ సెంచరీ సాధించాడు. 67 పరుగులతో పాటు 7 వికెట్లు కూడా పడగొట్టాడు. ఆ మ్యాచ్లో శార్ధూల్ ఠాకూర్ ఆడిన కవర్ డ్రైవ్లకి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. ఇక ఇంగ్లండ్తో జరగనున్న టీ20 తుది జట్టులో అతన్ని ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి.