ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ పంజాబ్ సంచలన విజయాన్ని అందుకుంది. ఓటమి తప్పదని భావించిన మ్యాచ్లో చివరి వరకు అద్భుతంగా పోరాడి గెలిచింది. ఎలైట్ గ్రూప్-సీలో భాగంగా ముంబైతో గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పంజాబ్ ఒక్క పరుగుతో తేడాతో విజయం సాధించింది. దాంతో ముంబై తరఫున 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన సర్ఫరాజ్ పోరాటం వృథా అయ్యింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 45.1 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అభిషేక్ శర్మ(8) నిరాశపర్చగా.. అన్మోల్ ప్రీత్ సింగ్(57), రమణ్దీప్ సింగ్(72) హాఫ్ సెంచరీలతో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్(3/37) మూడు వికెట్లు తీయగా.. శశాంక్, శివమ్ దూబే, ఓంకార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సాయిరాజ్ పాటిల్కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం ముంబై 26.2 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. సర్ఫరాజ్ ఖాన్(20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 62) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 45) పర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో గుర్నూర్ బ్రార్(4/57), మయాంక్ మార్కండే(4/31) నాలుగేసి వికెట్లతో ముంబై పతనాన్ని శాసించారు. హర్ప్రీత్ బ్రార్, హర్నూర్ సింగ్ తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్లో ముంబై ఓడినా సర్ఫరాజ్ ఖాన్ దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్తో పంజాబ్ బౌలర్లను వణికించాడు. అభిషేక్ శర్మ వేసిన ఓవర్లో సర్ఫరాజ్ ఖాన్ వరుసగా 6,4,6,4,6,4లతో 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే ఇది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.
సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసంతో ఈ మ్యాచ్లో ముంబై సునాయసంగా గెలిచేలా కనిపించింది. 17.2 ఓవర్లకు 169/3 స్కోర్తో పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. సూర్యకుమార్ యాదవ్(15), శివమ్ దూబే(12), హార్దిక్ తమోర్(15) తీవ్రంగా నిరాశపర్చారు. పంజాబ్ 8 మంది బౌలర్లు ఉపయోగించడం విశేషం. ఈ మ్యాచ్లో ముంబై ఓడినా ఈ గ్రూప్ నుంచి నాకౌట్ బెర్త్ దక్కించుకుంది. పంజాబ్ కూడా క్వార్టర్స్ చేరింది.