ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్, విదర్భ సెమీఫైనల్కు అర్హత సాధించాయి. బెంగళూరులోని బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్ మైదానాల్లో జరిగిన క్వార్టర్ ఫైనల్ 3లో మధ్యప్రదేశ్పై 183 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించగా.. నాలుగో క్వార్టర్ ఫైనల్లో విదర్భ 76 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది.
బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్ రెండో మైదానంలో ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు300 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశ్ రాథోడ్(73 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 86), అథర్వ టైడ్(72 బంతుల్లో 8 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ(2/47), నవ్దీప్ సైనీ(2/68), ప్రిన్స్ యాదవ్(2/59), నితీష్ రాణా(2/19) రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం ఢిల్లీ 45.1 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. అనుజ్ రావత్(98 బంతుల్లో 7 ఫోర్లతో 66) ఒక్క హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. స్టార్ బ్యాటర్ నితీష్ రాణా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. విదర్భ బౌలర్లలో నచికేత్ భూటే(4/51) నాలుగు వికెట్లు తీయగా.. హర్ష్ దూబే(/36) మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రఫుల్ హింగే(2/54)కు రెండు వికెట్లు దక్కాయి. యష్ కదమ్(1/25) ఒక వికెట్ తీసాడు. హాఫ్ సెంచరీతో విదర్బ విజయంలో కీలక పాత్ర పోషించిన యశ్ రాథోడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ టోర్నీలో ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ రెండు మ్యాచ్లు ఆడిన సంగతి తెలిసిందే. ఈ రెండు మ్యాచ్ల్లో కోహ్లీ సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించగా.. ఢిల్లీ రెండింటికి రెండు గెలిచింది.

మూడో క్వార్టర్ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 345 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రభ్సిమ్రాన్ సింగ్(86 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 88), అన్మోల్ ప్రీత్ సింగ్(62 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 70), నెహాల్ వధేరా(38 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో త్రిపురేష్ సింగ్(2/61), వెంకటేశ్ అయ్యర్(2/60) రెండేసి వికెట్లు తీయగా.. ఆర్యన్ పాండే, కుల్దీప్ సేన్ తలో వికెట్ తీసారు.
అనంతరం మధ్యప్రదేశ్ 31.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. రజత్ పటీదార్(40 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 38), త్రిపురేష్ సింగ్(30 బంతుల్లో 4 ఫోర్లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో సన్విర్ సింగ్(3/31) మూడు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్(2/28), రమణ్దీప్ సింగ్(2/23) రెండేసి వికెట్లు తీసారు. మయాంక్ మార్కండే ఒక వికెట్ తీసాడు.
జనవరి 15న సీఓఈ వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో కర్ణాటక, విదర్బ తలపడనుండగా.. జనవరి 16న జరిగే రెండో సెమీఫైనల్లో సౌరాష్ట్ర, పంజాబ్ అమీతుమీ తేల్చుకోనుంది. జనవరి 18న బెంగళూరులోని సీఓఈ వేదికగానే ఫైనల్ మ్యాచ్ జరగనుంది.