సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ తన జోరును కొనసాగిస్తున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హైదరాబాద్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ(72 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 93) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. తృటిలో శతకాన్ని చేజార్చుకున్నా తొలి వికెట్కు 196 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(105 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్స్లతో 137) సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో అతనికి ఇది వరుసగా మూడో శతకం. గత రెండు మ్యాచ్ల్లో ముంబైపై 150 నాటైట్, సౌరాష్ట్రపై(125) సెంచరీలు సాధించాడు. ప్రభ్సిమ్రాన్-అభిషేక్ విధ్వంసంతో హైదారబాద్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 80 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 426 పరుగులు చేసింది. రమణ్దీప్ సింగ్(53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 80) హాఫ్ సెంచరీతో రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో మొహమ్మద్, నిశాంత్, అనికేత్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన హైదరాబాద్ 47.5 ఓవర్లలో 346 పరుగులకు కుప్పకూలింది. పి నితేష్ రెడ్డి(87 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్లతో 111) సెంచరీ సాధించగా.. తనయ్ త్యాగరాజన్(42 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 74) హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ తిలక్ వర్మ(42 బంతుల్లో ఫోర్తో 28) తీవ్రంగా నిరాశపరిచాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(4/50) నాలుగు వికెట్లు తీయగా.. రఘు శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ, సన్వీర్ సింగ్, నమన్ ధిర్ తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ అరుదైన రికార్డ్ సాధించింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే ఒకే సీజన్లో రెండు సార్లు 400 ప్లస్ రన్స్ చేసిన తొలి జట్టుగా పంజాబ్ రికార్డ్ సాధించింది.