విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ హైదరాబాద్ ఓటమిపాలైంది. సోమవారం అస్సాంతో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో ఈ టోర్నీలో హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. రాహుల్ సింగ్(71 బంతుల్లో 14 ఫోర్లతో 79), అభిరత్ రెడ్డి(66 బంతుల్లో 6 ఫోర్లతో 54), నితేష్ రెడ్డి(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం అస్సాం 49.3 ఓవర్లలో 6 వికెట్లకు 314 పరుగులు చేసి గెలుపొందింది. శివ్శంకర్ రాయ్(112) సెంచరీతో చెలరేగగా.. సౌరవ్ దిహింగియా(91), దెనిష్ దాస్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో చామ మిలింద్(3/68) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ గౌడ్ ఒక వికెట్ పడగొట్టాడు. వరుసగా పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో హైదరాబాద్ 7వ స్థానంలో నిలిచింది. బుధవారం జరిగే తదుపరి మ్యాచ్లో బరోడాతో హైదరాబాద్ తలపడనుంది. చివరి మూడు మ్యాచ్లను హైదరాబాద్ గెలిచినా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

గత మ్యాచ్లో గెలుపొందిన ఆంధ్ర.. మరో పరాజయాన్ని చవిచూసింది. ఒడిశాతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 49.2 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. ఎస్డీఎన్వీ ప్రసాద్(66) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. సౌరభ్ కుమార్(47) పర్వాలేదనిపించాడు. కెప్టెన్ నితీష్ కుమార్ రెడ్డి(6) తీవ్రంగా నిరాశపర్చాడు.
అనంతరం ఒడిశా 43.4 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసి గెలుపొందింది. గోవింద్ పొద్దార్(89), ఓం టీ ముండే(91) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారయణ రాజు(2/49) రెండు వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసాడు.