
249 పరుగుల భాగస్వామ్యం..
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 338 పరుగులు చేసింది. పడిక్కల్, సమర్థ్ తొలి వికెట్కు 249 పరుగులు జోడించారు. కాగా ఓపెనర్ సమర్థ్ ఇన్నింగ్స్ ఆసాంతం ఫోర్లు, సిక్సర్లతో చెడుగుడు ఆడేశాడు. అయితే తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక టోర్నీలో దేవదత్కిది వరుసగా నాలుగో సెంచరీ. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేరళ 43.4 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక బౌలర్ రోణిత్ మోరే 5 వికెట్లతో కేరళ పతనాన్ని శాసించాడు. విత్సల్ గోవింద్(92), అజారుద్దీన్(52) పోరాడినా ఫలితం లేకపోయింది.

4 సెంచరీలు.. 2 అర్థసెంచరీలు..
గతేడాది ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన పడిక్కల్.. సూపర్ ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకొని మంచి అనుభవం సాధించిన అతను దేశవాళీ క్రికెట్లో రెచ్చిపోతున్నాడు. ఇప్పటి వరకు విజయ్ హజారే ట్రోపీలో 6 మ్యాచులు ఆడిన పడిక్కల్.. 4 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు బాదేశాడు. వరుసగా 52 (84 బంతుల్లో), 97 (98), 152 (140), 126* (138), 145* (125), 101 (119) స్కోర్లు చేశాడు. మొత్తంగా 673 పరుగులు సాధించి ఆర్సీబీ అభిమానులకు ఆశలు రేకెత్తిస్తున్నాడు. కాగా మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో పడిక్కల్ సూపర్ ఫామ్పై ఆర్సీబీ సంతోషం వ్యక్తం చేసింది. అతనికి తిరుగులేదని ట్వీట్ చేసింది.

శిఖర్ ధావన్కు ఎసరు..
తిరుగులేని ఆటతీరు కనబరుస్తున్న దేవదత్ను టీమిండియాకు ఎంపిక చేయాలని అభిమానులు కోరుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పడిక్కల్ను ప్రశంసిస్తూ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 'చూడబోతుంటే శిఖర్ ధావన్ స్థానంలో టీమిండియాకు దేవదత్ పడిక్కల్ దొరికినట్టే కనిపిస్తున్నాడు. వరుసగా 4 సెంచరీలంటే మాటలు కాదు. అతనిది అంతర్జాతీయ స్థాయి' అని ఓ అభిమాని కామెంట్ చేయగా... 'భారత క్రికెట్కు కర్ణాటక ఎంతోమంది దిగ్గజాలను అందించింది. తర్వాతి స్థానం దేవదత్ పడిక్కల్దే' అని మరొకరు ట్వీట్ చేశారు.

ఆంధ్ర జట్టుకు నిరాశ
ఇక లీగ్ దశలో తమ గ్రూప్లో 'టాప్' ర్యాంక్లో నిలిచిన ఆంధ్ర జట్టు నాకౌట్ మ్యాచ్లో మాత్రం తడబడింది. గుజరాత్ జట్టుతో సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర జట్టు 117 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత గుజరాత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 299 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ (134; 10 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఆంధ్ర 41.2 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది.


Click it and Unblock the Notifications












