
న్యూఢిల్లీ: దేశవాళీ ప్రతిష్టాత్మ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రెండు మేటీ జట్ల మధ్య ఆసక్తికర పోరుకు తెరలేచింది. గురువారం ఇక్కడి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఫస్ట్ సెమీఫైనల్లో డొమెస్టిక్ టాప్ టీమ్ ముంబై.. బలమైన కర్నాటకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ పోరులో ఇరు జట్ల ఓపెనర్లు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్పై అందరి దృష్టి నిలిచింది. సూపర్ ఫామ్లో ఉన్న ఈ ఇద్దరు ఎలా చెలరేగుతారో అన్న ఆసక్తి నెలకొంది.
ముంబైకి నాయకత్వం వహిస్తున్న పృథ్వీ షా గ్రూప్ దశలో పుదుచ్చేరిపై అజేయంగా 227 పరుగులు చేసి.. టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు. క్వార్టర్ఫైనల్లో మంగళవారం సౌరాష్ట్రపై 185 పరుగులతో అజేయంగా నిలిచిన అతను... లిస్ట్ ఎ క్రికెట్లో చేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్మన్గా ఘనత సాధించాడు. ఈ క్రమంలో ధోనీ, కోహ్లీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
మరోవైపు పడిక్కల్ లిస్ట్ ఎ క్రికెట్లో వరుసగా నాలుగు సెంచరీలు బాదిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా 673 పరుగులతో ఈ టోర్నీ టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. షా, పడిక్కల్లు జోరు కొనసాగిస్తూ భారీ ఇన్నింగ్స్తో తమ జట్లను ఫైనల్ చేర్చడానికి ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో పడిక్కల్, పృథ్వీ షా.. సెలక్టర్లను ఆకట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మనీష్ పాండే, ప్రసిద్ధ్ కృష్ణ, ఆల్రౌండర్ శ్రేయస్ గోపాల్, కె.గౌతమ్ వంటి ఆల్రౌండర్లతో కర్ణాటక జట్టే ముంబై కన్నా కాస్త బలంగా కనిపిస్తోంది. కుర్రాళ్లతో నిండిన ముంబైకి రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్లు అందుబాటులో లేరు. మరో సెమీఫైనల్లో గుజరాత్, ఉత్తర్ప్రదేశ్ తలపడనున్నాయి.