న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్కు ఎంపికవ్వని రుతురాజ్ గైక్వాడ్.. తన బ్యాట్తోనే సెలెక్టర్లకు సమాధానమిచ్చాడు. విధ్వంసకర శతకంతో చెలరేగి వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. 'నీ అవ్వ నన్నే తప్పిస్తారా?' అని బౌలర్లను శతక్కొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గురువారం గోవాతో జరిగిన మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర సెంచరీతో అరాచకం సృష్టించాడు. తద్వారా లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 20 శతకాలు నమోదు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో అతను విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్ ఆల్టైమ్ రికార్డ్లను బద్దలుకొట్టాడు.
శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ గాయాల నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా పిలుపును అందుకున్న రుతురాజ్ గైక్వాడ్.. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. తొలి వన్డేలో విఫలమైనా..రెండో వన్డేలో సెంచరీతో చెలరేగాడు. మూడో వన్డేలో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే గిల్, అయ్యర్ అందుబాటులోకి రావడంతో న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ నుంచి రుతురాజ్ ఉద్వాసనకు గురయ్యాడు.

ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. రాబిన్ ఊతప్ప అయితే.. భారత సెలెక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై, ఢిల్లీ, పంజాబ్ ఆటగాళ్లకే భారత జట్టులో సుస్థిరం స్థానం ఉంటుందని, రుతురాజ్కు అన్యాం జరిగిందని మండిపడ్డాడు.
రుతురాజ్ గైక్వాడ్ మాత్రం సెలెక్టర్ల నిర్ణయంపై స్పందించలేదు. మౌనంగా తన బ్యాట్తోనే వారికి దిమ్మతిరిగే బదులిచ్చాడు. గోవాతో మ్యాచ్లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న మహారాష్ట్రను రుతురాజ్ సెంచరీతో ఆదుకున్నాడు. 131 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 134 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దాంతో మహారాష్ట్ర 249 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసి 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది రుతురాజ్ గైక్వాడ్కు 20వ లిస్ట్-ఏ సెంచరీ.
అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్గా రుతురాజ్ నిలిచాడు. 95 ఇన్నింగ్స్ల్లోనే అతను ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ, బాబర్ ఆజామ్ రికార్డులను బద్దలు కొట్టాడు. 131 లిస్ట్-ఏ ఇన్నింగ్స్ల్లో బాబర్ ఆజామ్ 20 శతకాలు నమోదు చేయగా.. కోహ్లీ 143 ఇన్నింగ్స్ల్లో 20 సెంచరీలు అందుకున్నాడు.
లిస్ట్-ఏ క్రికెట్లో కనీసం 50 ఇన్నింగ్స్లు ఆడిన ఆటగాళ్లలో అత్యధిక సగటు కలిగిన బ్యాటర్గా రుతురాజ్ గైక్వాడ్ నిలిచాడు. అతని సగటు 58.83 కాగా.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ బెవాన్ 57.86 సగటుతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దేశవాళీ క్రికెట్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ తన సత్తా నిరూపించుకున్నా రుతురాజ్ గైక్వాడ్కు అవకాశాలు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేయాల్సిందని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. మిడిలార్డర్లో అతను స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఆడుతాడని, అతన్ని జట్టులో కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డాడు.