
బ్లాంక్ మైండ్తో వచ్చా..
ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్ అనంతరం తాజాగా బీసీసీఐ టీవీతో మాట్లాడిన అయ్యర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. భారత జట్టు తరఫున ఆడేందుకు ఆతృతగా ఉన్నట్లు పేర్కొన్నాడు. 'రాహుల్ ద్రవిడ్ సర్ ఓ లెజండ్. ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నా వల్ల అయ్యేంత నేర్చుకోవాలనుకుంటున్నా. అందుకే మదిలో ఎలాంటి ఆలోచనలు లేకుండా బ్లాంక్గా ఇక్కడికి వచ్చా. ఏ బాధ్యత ఇచ్చినా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తా.'అని చెప్పుకొచ్చాడు.

రోహిత్తో మాట్లాడటం..
కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్తో మాట్లాడానని, వారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని అయ్యర్ తెలిపాడు. రోహిత్ తనతో ఏదైన పంచుకుంటే దాన్ని ప్రత్యేకంగా ఫీలవుతానన్నాడు. 'కెప్టెన్, కోచ్తో మాట్లాడాను. అలాగే రిషభ్ పంత్తో కబుర్లు చెప్పుకున్నాం. అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. వారితో మాట్లాడిన తర్వాత నా కాన్ఫిడెన్స్ పెరిగింది. దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో మాట్లాడటం గొప్ప అనుభూతినిస్తుంది. ముఖ్యంగా ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్మన్ అయిన రోహిత్ మాట్లాడటం ప్రత్యేకం.'అని అయ్యర్ పేర్కొన్నాడు.

దేశం తరఫున ఆడటం..
'నేను కొంతకాలంగా దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నాను. నా జట్టు ఏ విధంగా అయితే పురోగతి సాధించిందో.. నేను కూడా అదే విధంగా పురోగమించి ఈ స్ధాయికి చేరుకున్నాను. దేశం కోసం ఆడటం ఏ ఆటగాడికైనా ఒక కల. కానీ అంతకమించి దేశం కోసం మేజర్ టోర్నీలు గెలిచేలా ఆడటం ముఖ్యం" అని అయ్యర్ పేర్కొన్నాడు. అదేవిధంగా మధ్యప్రదేశ్ జట్టులో తన సహచరడైన ఆవేశ్ఖాన్ గురించి మాట్లాడుతూ.. "వ్యక్తిగతంగా చెప్పాలంటే..నా కంటే ఆవేశ్ భారత జట్టుఎంపిక కావడం సంతోషంగా ఉంది.
దేశవాళీ క్రికెట్లో మేము ఇద్దరం ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. దాదాపు ఐదేళ్లుగా డ్రెస్సింగ్ రూమ్ను షేర్ చేసుకుంటున్నాం. అతడు పడిన కష్టాలను దగ్గరుండి నేను చేశాను. అందుకే నాకన్న తనకి అవకాశం దక్కడం నాకు సంతోషంగా అనిపిస్తుంది" అని అయ్యర్ పేర్కొన్నాడు.

మరో శకం మొదలు..
నేడు(నవంబర్ 17) జరగనున్న తొలి మ్యాచ్లో కివీస్ను ఢీకొట్టేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. టీ20 కెప్టెన్ పగ్గాలు చేపట్టాక రోహిత్కు ఇదే తొలి మ్యాచ్ కాగా, హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ తన ప్రస్థానాన్ని ఈ మ్యాచ్తోనే ప్రారంభించనున్నాడు. టీ20 ప్రపంచకప్ రన్నరప్ కివీస్ జోరు మీదుండగా.. టీ20 ఫార్మాట్ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ, కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో టీమిండియా చేయబోయే పెర్ఫామెన్స్పై అందరి దృష్టి నెలకొంది. రోహిత్ గతంలో పలు మార్లు కెప్టెన్గా వ్యవహరించాడు.
గత శ్రీలంక పర్యటనలో ద్రవిడ్ కూడా భారత్ కోచ్గా పనిచేశాడు. కానీ వీరిద్దరూ ఇప్పుడు పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టగా.. తొలి పరీక్షను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. తొలి పోరులోనే గెలిచి సిరీస్ పట్టు సాధించాలని భావిస్తున్న రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్లో కివీస్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తొంది. కోహ్లీ సహా పలువురు సీనియర్ల గైర్హాజరీలో చాన్నాళ్ల తర్వాత సొంతగడ్డపై ఆడుతున్న ఈ సిరీస్ ఫలితం భారత్కు కీలకం.


Click it and Unblock the Notifications
