
మాటలు రావడం లేదు..
ఐపీఎల్ 2021 సెకండాఫ్లో ఔటాఫ్ సిలబస్లా మైదానంలోకి అడుగుపెట్టి దుమ్మురేపిన వెంకటేశ్ అయ్యర్.. జట్టు ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ పెర్ఫామెన్స్తోనే భారత జట్టు నుంచి పిలుపును అందుకున్నాడు. ఇక భారత జట్టుకు ఎంపికయ్యాననే విషయాన్ని ఆవేశ్ ఖాన్ తెలియజేశాడని, ఆ క్షణం తన ఆనందానికి హద్దేలేకుండా పోయిందని వెంకటేశ్ అయ్యర్ అన్నాడు. భారత జట్టు తరఫున ఆడేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'టీమిండియాకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకోసం నేను చాలా కష్టపడ్డాను. ఇంత త్వరగా జట్టుకు ఎంపికవుతాననుకోలేదు. నా ఫీలింగ్ను చెప్పడానికి మాటలు రావడం లేదు. నేను బ్యాటింగ్కి వెళ్లిన ప్రతిసారి మా జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నించాను.

ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్..
నాపై నమ్మకం ఉంచి నన్ను ఎంపిక చేసిన సెలెక్టర్లకు, కెప్టెన్కు.. నా ఎదుగుదలకు సాయపడిన కోచ్లకు, సీనియర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి క్రికెటర్కు టీమిండియా జెర్సీ ధరించి ఆడాలనేది ఓ కల. నా కల ఈ రోజు నిజమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడేందుకు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఒక్క ఐపీఎల్ ప్రదర్శనతోనే నాకు ఈ అవకాశం రాలేదు. మధ్యప్రదేశ్ తరఫున రంజీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో కూడా రాణించాను. అక్కడ రాణించడంతోనే ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడుతాననే నమ్మకం కలిగింది. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది.' అని వెంకటేశ్ అయ్యర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్లో వెంకటేశ్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. అతను ఆడిన 10 మ్యాచ్ల్లో 41.11 సగటుతో 370 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ ప్రదర్శనతోనే అయ్యర్కు అవకాశం వచ్చింది.

హార్దిక్ పాండ్యాకు చెక్..
అంతేకాకుండా టీ20 ప్రపంచకప్లో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైఫల్యం అయ్యర్కు కలిసొచ్చింది. అతనిపై వేటు వేసిన సెలెక్టర్లు..వెంకటేశ్ అయ్యర్ను పాండ్యాకు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యాను కేవలం బ్యాటర్గా జట్టులో కొనసాగించడం అనవసరమని సెలెక్టర్ల భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్లో బౌలింగ్ చేసే సామర్థ్యం కలిగిన బ్యాట్స్మన్ను రెడీ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతోంది. అందుకే పృథ్వీ షా, శుభ్మన్ గిల్లను కాదని వెంకటేశ్ అయ్యర్కు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. ఓపెనర్ అయినటు వంటి వెంకటేశ్ అయ్యర్ను మిడిలార్డర్ బ్యాట్స్మన్గా మార్చేందుకు కూడా సిద్దమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి వెంకటేశ్ అయ్యర్తో హార్దిక్ పాండ్యాకు చెక్ పెట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

నవంబర్ 17 నుంచి..
భారత్, కివీస్ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపూర్(నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ(నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్కతా(నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి.అనంతరం ఇరు జట్ల మధ్య రెండు టెస్ట్ల సిరీస్ జరగనుంది. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబై వేదికగా రెండో టెస్టు జరగనుంది.

న్యూజిలాండ్తో బరిలోకి దిగే భారత టీ20 జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్


Click it and Unblock the Notifications
