అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న సూపర్-6 మ్యాచ్లో భారత్ 253 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. పాకిస్థాన్ బౌలర్లు అబ్దుల్ సుభాన్(3/32), మొహమ్మద్ సయ్యమ్(2/69) ధాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.
వైభవ్ సూర్యవంశీ(30)తో పాటు టాపార్డర్ విఫలమవగా.. వేదాంత్ త్రివేది(98 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 68) హాఫ్ సెంచరీతో భారత్ను ఆదుకున్నాడు. చివర్లో కాన్షిక్ చౌహన్(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 35), ఖిలాన్ పటేల్(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 21) మెరుపులు మెరిపించడంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది.
పాకిస్థాన్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్(3/32), మొహమ్మద్ సయ్యమ్(2/69)తో పాటు అలీరాజా, అహ్మద్ హుస్సేన్, మోమిన్ ఖమర్, అలీ హసన్ బలోచ్ తలో వికెట్ తీసి సత్తా చాటారు. ఈ పిచ్ స్లోగా ఉన్న నేపథ్యంలో ఈ 253 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం టీమిండియాకు కష్టం కాకపోవచ్చు. అద్భుతమైన బౌలింగ్కు కళ్లు చెదిరే ఫీల్డింగ్ తోడైతే ఆయుష్ మాత్రే సేనకు తిరుగుండదు.

ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు వైభవ్ సూర్యవంశీ దూకుడైన ఆరంభాన్ని అందించాడు. ఐదు ఫోర్లు, ఓ భారీ సిక్సర్తో విరుచుకుపడిన వైభవ్ సూర్యవంశీకి ఒకే బంతికి రెండు లైఫ్స్ లభించాయి. మోహమ్మద్ సయ్యమ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్తో పాటు రనౌటయ్యే ప్రమాదం నుంచి వైభవ్ తప్పించుకున్నాడు. కానీ అవకాశాలను అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరుసటి బంతికే కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 47 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ఆయుష్ మాత్రే(0) కూడా కీపర్ క్యాచ్గా వెనుదిరిగి డకౌటయ్యాడు. మరుసటి ఓవర్ తొలి బంతికే మరో ఓపెనర్ ఆరో జార్జ్(16)ను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో 4 బంతుల వ్యవధిలోనే భారత్ 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
47/3 వంటి క్లిష్ట పరిస్థితుల్లో వేదాంత్ త్రివేది జట్టును ఆదుకున్నాడు. మొహమ్మద్ సయ్యమ్ బౌలింగ్లో లభించిన ఫ్రీ హిట్ను భారీ సిక్సర్గా మలిచిన అతను విహాన్ మల్హోత్ర(21) కలిసి ఆచితూచి ఆడాడు. నాలుగో వికెట్కు 62 పరుగులు జోడించిన అనంతరం విహాన్ మల్హోత్ర ఔటవ్వగా.. అభిజ్ఞాన్ కుండు(16) ఐదో వికెట్కు 38 పరుగులు, అంబ్రిష్తో కలిసి ఆరో వికెట్కు 35 పరుగులు జోడించాడు.
ఈ క్రమంలో అతను 74 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ దిశగా సాగిన అతన్ని మోమిన్ క్యాచ్ ఔట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో కౌన్షిక్ చౌహన్, ఖిలాన్ పటేల్(21) దూకుడుగా ఆడి జట్టుకు 252 పరుగులు అందించారు.