తన జీవిత ప్రయాణం విభిన్నంగా సాగిందని టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ అన్నాడు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు.. ఆర్కిటెక్ట్ అయ్యి సినిమాలు తీయాలని కలలు కన్న తాను చివరకు క్రికెటర్ను అయ్యానని తెలిపాడు. 26 ఏళ్ల లేటు వయసులో క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నానని చెప్పాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తీ(5/42) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. కెరీర్లో ఆడిన రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్గా వరుణ్ చక్రవర్తీ చరిత్ర సృష్టించాడు. అతని అసాధారణ ప్రదర్శనతో టీమిండియా 44 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది.
దుబాయ్ వేదికగానే జరిగిన టీ20 ప్రపంచకప్ 2021లో దారుణంగా విఫలమైన వరుణ్ చక్రవర్తీ.. మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి సంచలన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో కేకేఆర్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన వరుణ్ చక్రవర్తీకి.. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టడం కలిసొచ్చింది. ముందుగా టీ20ల్లో అవకాశం కల్పించిన గంభీర్.. ఆ తర్వాత వన్డేల్లో చోటిచ్చాడు. అనేక విమర్శల మధ్య ఓ బ్యాటర్ను జట్టు నుంచి తప్పించి మరి వరుణ్ చక్రవర్తీని ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఎంపిక చేశాడు. కీలక మ్యాచ్లో అవకాశం ఇచ్చి తన నిర్ణయం సరైనదేనని చాటి చెప్పాడు.

ఈ సంచలన ప్రదర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన వరుణ్ చక్రవర్తీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నేను చాలా ఆలస్యంగా క్రికెట్ను మొదలుపెట్టాను. నా 26 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించాను. అంతకుముందు వరకు ఆర్కిటెక్ట్ అయ్యి సినిమాలు తీయాలని కలలు కన్నాను. అందుకే నాకు భిన్నమైన కెరీర్లు ఉన్నాయి. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. 26 ఏళ్ల తర్వాత క్రికెట్ గురించి కలలు కనడం మొదలుపెట్టాను. అవన్నీ నిజమవుతున్నాయి కాబట్టే ప్రస్తుతం సంతోషంగా ఉన్నాను.
నేను దేవుడిపై భారం వేసి నా ప్రాసెస్ను మాత్రమే కొనసాగించాను. ఫలితాలు అవే వచ్చాయి. న్యూజిలాండ్తో మ్యాచ్లో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే.. మ్యాచ్ ఆరంభం నుంచే ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం. ఛాంపియన్స్ అంతా ఇలానే చేస్తారు. విరాట్ కోహ్లీ, రోహిత్, హార్దిక్లను చూసి ఈ విషయాన్ని నేర్చుకున్నాను. అయితే న్యూజిలాండ్తో మ్యాచ్ ఆరంభంలో చాలా భయపడ్డాను. వన్డే క్రికెట్ ఆడిన అనుభవం ఎక్కువగా లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాను. కానీ మ్యాచ్ సాగుతున్నా కొద్దీ నాపై నాకు నమ్మకం ఏర్పడింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్లు తరుచూ మాట్లాడి నాకు అండగా నిలిచారు.' అని వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు.