ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సంచలన ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన వరుణ్ చక్రవర్తీ.. తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2021 ఘోర పరాజయం తర్వాత తాను భయానక పరిస్థితులు ఎదుర్కొన్నానని, తనను చంపేస్తామని కూడా బెదిరించారని తెలిపాడు. నాలుగేళ్ల క్రితం విరాట్ కోహ్లీ సారథ్యంలో దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో వరుణ్ చక్రవర్తీ ఆడాడు.
మిస్టరీ స్పిన్నర్గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని అతన్ని ఎంపిక చేయగా.. దారుణంగా విఫలమయ్యాడు. ఆ టోర్నీలో భారత్.. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడి గ్రూప్ దశలోనే ఇంటి దారిపట్టింది. ఆ తర్వాత భారత జట్టుకు మూడేళ్ల పాటు దూరమైన వరుణ్ చక్రవర్తీ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సాయంతో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. సంచలన ప్రదర్శనతో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికై 3 మ్యాచ్ల్లో 11 వికెట్ల తీసాడు.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ చక్రవర్తీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'టీ20 వరల్డ్ కప్-2021 వైఫల్యం తర్వాత నేను ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాను. భారత్కు తిరిగి వస్తే చంపేస్తామనే బెదిరింపులు వచ్చాయి. కొందరు నన్ను బైక్ మీద ఫాలో అయ్యి భయపెట్టారు. దాంతో నేను డిప్రేషన్లోకి వెళ్లాను.
ఈ టోర్నీ వైఫల్యం తర్వాత నన్ను నేను ఎంతో మార్చుకున్నా. నా ప్రాక్టీస్ నుంచి అనేక విషయాల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఒక సెషన్లో 50 బంతులు వేసే నేను తర్వాత దాన్ని డబుల్ చేశా. అయితే ఎంత బాగా ఆడినా సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. అలా మూడేళ్లు గడిచాయి. దాంతో నేను కూడా ఆశలు వదులుకున్నా. కానీ కేకేఆర్ ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ గెలవడం.. ఆ సీజన్లో నేను అత్యుత్తమ ప్రదర్శన చేయడం నాకు కలిసొచ్చింది. ఆ ప్రదర్శనతోనే నేను టీమిండియాలోకి పునరాగమనం చేశాను.'అని వరుణ్ చక్రవర్తీ చెప్పుకొచ్చాడు.