బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్ కారణంగా తనకు పుట్టిన కొడుకు ఇంకా చూడలేదని కోల్కతా నైట్రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ భావోద్వేగానికి గురయ్యాడు. క్యాష్ రిచ్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో బుధవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు ఓటముల తర్వాత కేకేఆర్ విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తీ(3/27) తన మిస్టర్ స్పిన్తో ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. ఆర్సీబీ డేంజరస్ బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్వెల్(5), క్రీజులో సెట్ అయిన మహిపాల్ లోమ్రోర్(34), దినేశ్ కార్తీక్(22)లను పెవిలియన్ చేర్చాడు. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన వరుణ్ చక్రవర్తీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ సందర్భంగా మాట్లాడిన వరుణ్ చక్రవర్తీ.. లైఫ్ చాలా క్రేజీగా ఉందని చెప్పాడు. గత మ్యాచ్లో తన బౌలింగ్ను చితక్కొట్టారని, ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచానని చెప్పాడు. ఇటీవలే తనకు కొడుకుపుట్టాడని, ఐపీఎల్ కారణంగా ఇంకా అతన్ని చూడలేదన్నాడు. ఈ అవార్డును తన భార్యతో పాటు కొత్తగా పుట్టిన బుడ్డోడికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు.
'గత మ్యాచ్లో నేను 49 పరుగులు ఇచ్చాను. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించా. లైఫ్ చాలా క్రేజీగా ఉంది. ఈ ఏడాది వేరియేషన్స్ కంటే కచ్చితంగా బౌలింగ్ వేయడంపైనే ఫోకస్ పెట్టాను. ఎక్కువ వేరియేషన్స్తో బౌలింగ్ చేయాలనుకోవడం లేదు. నా బౌలింగ్పై చాలా వర్క్ చేస్తున్నాను. ఈ ప్రదర్శన క్రెడిట్ ఏసీ ప్రతీపన్కే ఇవ్వాలి. నా బౌలింగ్ మెరుగవ్వడంలో అతను సహకరించాడు. అభిషేక్ నాయర్ కూడా సాయం చేశాడు.
కఠిన ఓవర్లు వేయడం.. సవాళ్లు స్వీకరించడం నాకు చాలా ఇష్టం. నితీశ్కు అవసరమైనప్పుడల్లా నేను బౌలింగ్ చేసి ఫలితం రాబడుతున్నాను. నా ప్రదర్శన పూర్తి క్రెడిట్ నాకు ఇటీవలే పుట్టిన కొడుకుకుఇవ్వాలనుకుంటున్నా. ఐపీఎల్ కారణంగా అతన్ని ఇంకా చూడలేదు. నా భార్యతో పాటు అతనికి ఈ అవార్డు అంకితమిస్తున్నా.'అని వరుణ్ చక్రవర్తీ చెప్పుకొచ్చాడు.