ఆసియా కప్ 2025 టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ దుమ్మురేపిన టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ సత్తా చాటారు. ఇప్పటికే టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అభిషేక్ శర్మ, ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తీ టాప్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. తాజాగా వెల్లడించిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మూడు విభాగాల్లో టీమిండియా ఆటగాళ్లే అగ్రస్థానంలో నిలిచారు.
ఈ ఏడాది మెరుగైన ప్రదర్శన చేసిన వరుణ్ చక్రవర్తీ టాప్ ర్యాంక్ అందుకున్నాడు. దాంతో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా నిలిచాడు. గతంలో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆసియా కప్ 2025లో వరుసగా రెండు మ్యాచ్ల్లో వరుణ్ మెరుగైన ప్రదర్శన చేశాడు. దాంతో మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ ఖాతాలో 733 రేటింగ్ పాయింట్స్ ఉండగా.. అతని తర్వాత నిలిచిన జాకబ్ డఫీ(717), అకీల్ హుసేన్(707), ఆడమ్ జంపా(700), అదిల్ రషీద్(677) టాప్-5లో ఉన్నారు.

భారత జట్టులో చోటు కోల్పోయిన రవి బిష్ణోయ్ రెండు ర్యాంకులు దిగజారి 8వ స్థానంలో నిలిచాడు. ఆసియా కప్లో రెండు మ్యాచ్ల్లో ఏడు వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్ 16 స్థానాలను మెరుగుపర్చుకొని 23వ ర్యాంకులోకి దూసుకొచ్చాడు. బెంచ్కే పరిమితమైన అర్ష్దీప్ సింగ్ ఐదు స్థానాలు దిగజారి 14వ స్థానంలో నిలిచాడు.
ఆసియా కప్ 2025లోనూ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన అభిషేక్ శర్మ(884) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రెండో ర్యాంకర్ తిలక్ వర్మ మాత్రం నాలుగో స్థానానికి పడిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ ఒక స్థానం దిగజారి ఏడో స్థానంలో నిలిచాడు. ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అక్షర్ పటేల్ రెండు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్ సాధించాడు. అభిషేక్ శర్మ(161) నాలుగు స్థానాలు దూసుకొచ్చి 14వ ర్యాంక్ అందుకున్నాడు.