టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. 14 ఏళ్లకే వరల్డ్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ లీగ్ ఐపీఎల్లోకి అరంగేట్రం చేసి ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ.. తొలి బంతినే సిక్స్ కొట్టి ఔరా అనించాడు. తన మూడో మ్యాచ్లోనే విధ్వంసకర శతకంతో చెలరేగాడు. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలోనే సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ సాధించాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో మేటి బౌలర్లంతా భయపడేలా.. ఖతర్నాక్ సిక్స్లతో బౌలర్లను ఊచకోత కోశాడు. పేసర్, స్పిన్నర్ అని తేడా లేకుండా సిక్సర్లతో స్టేడియాలను హోరెత్తించాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో స్టార్ ఆటగాడిగా గుర్తింపు పొందిన వైభవ్ సూర్యవంశీ.. 14 ఏళ్ల వయసులో కోట్ల రూపాయాలను ఆర్జిస్తున్నాడు.

వైభవ్ సూర్యవంశీ బీహార్, సమస్తిపూర్ జిల్లాలోని తాజ్పూర్ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక మాములు రైతు. ఆయన క్రికెటర్ కావాలని కలలు కన్నారు. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. దాంతో ఆ కలను తన కొడుకు ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నారు. నాలుగేళ్ల వయసులోనే వైభవ్కు క్రికెట్ ఓనమాలు నేర్పారు. ఆ తర్వాత సమస్తిపూర్లోని ఒక క్రికెట్ అకాడమీలో చేర్పించారు. అనంతరం మాజీ రంజీ ప్లేయర్ మనీష్ ఓఝా వద్ద శిక్షణ ఇప్పించారు.
ఒక సాధారణ రైతు అయినప్పటికీ, తన కుమారుడు క్రికెటర్గా ఎదగాలనే కలను సాకారం చేయడానికి సంజీవ్ ఎన్నో త్యాగాలు చేశారు. వైభవ్ క్రికెట్ శిక్షణ ఖర్చులు భారం కావడంతో తనకున్న కొంత భూమిని కూడా అమ్మేశారు. అలాంటి వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ద్వారా రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్తో అతని రాతే మారిపోయింది.
పలు మీడియా కథనాల ప్రకారం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆస్థి రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. ఐపీఎల్ 2025 వేలంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్.. రూ. కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో సెంచరీ చేసినందుకు అతనికి బిహార్ ప్రభుత్వం రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించింది. ఐపీఎల్ 2025 సీజన్లో స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు లభించింది. ఈ అవార్డ్ కింద రూ. 10 లక్షల క్యాష్ ప్రైజ్తో పాటు రూ. 20 లక్షల టాటా కర్వ్ ఎస్యూవీ కార్ బహుమతిగా లభించింది. భారత అండర్ 19 ప్లేయర్గా వైభవ్కు ఓ సిరీస్లో రోజుకు రూ.20 వేల మ్యాచ్ ఫీజు లభించనుంది.
బీహార్ రంజీ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ మ్యాచ్కు రూ.1.6 లక్షల మ్యాచ్ ఫీజు అందుకున్నాడు. ఐపీఎల్తో పాటు పలు టోర్నీల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ద్వారా వచ్చిన డబ్బుతో వైభవ్ సంపాదించిన ఆస్తి రూ. 2.5 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక వైభవ్ అడ్వర్టైజ్మెంట్ రంగంలో అడుగు పెట్టలేదు. భవిష్యత్తులో అతను ఇలానే ఆడితే 19 ఏళ్లు వచ్చే వరకు అతని ఆస్తి రూ. 300 కోట్లకు చేరుతుందని బిజినెస్ వర్గాలు అంటున్నాయి.