ఇంగ్లండ్ పర్యటనను భారత్ అండర్ 19 జట్టు ఘనంగా ప్రారంభించింది. ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన యంగ్ ఇండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ లయన్స్ U-19 జట్టుతో జరిగిన సన్నాహక మ్యాచ్లో 444 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసి భారీ విజయాన్నందుకున్న ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత U-19 జట్టు అధికారిక మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించింది. 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 48) విధ్వంసకర బ్యాటింగ్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ అండర్ 19 జట్టు 42.2 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్(90 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇసాక్ మహమ్మద్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 42) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో కన్షిక్ చౌహన్(3/20) మూడు వికెట్లు తీయగా.. హెనిల్ పటేల్(2/41), అంబ్రిష్(2/24), మహమ్మద్ ఇనాన్(2/37) రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ అండర్ 19 జట్టు 24 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు కెప్టెన్ ఆయుష్ మాత్రే(30 బంతుల్లో 4 ఫోర్లతో 21), వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు(34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 45 నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ అండర్ 19 టీమ్ బౌలర్లలో ఫ్రెంచ్(2/46) రెండు వికెట్లు తీయగా..జాక్ హోమ్, రాల్ఫీ అల్బెర్ట్(1/25) ఒక వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో ఐదు వన్డేల సిరీస్లో భారత అండర్ 19 జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సోమవారం జరగనుంది. ఈ పర్యటనలో భారత అండర్ 19 జట్టు ఇంగ్లండ్ అండర్ 19 టీమ్తో ఐదు వన్డేల సిరీస్తో పాటు రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. ఐపీఎల్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుష్ మాత్రే ఈ జట్టులో ఆడుతున్నారు. ఆయుష్ మాత్రేనే భారత అండర్ 19 టీమ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.