ఇంగ్లండ్ గడ్డపై భారత అండర్ 19 టీమ్ దుమ్మురేపుతోంది. ఇంగ్లండ్ అండర్ 19 టీమ్తో ఐదు యూత్ వన్డేల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన నాలుగో మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన యంగ్ ఇండియా 55 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. వైభవ్ సూర్యవంశీ(78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్లతో 143) విధ్వంసకర శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ అండర్ 19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 363 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీతో పాటు విహాన్ మల్హోత్రా(121 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 129) కూడా సెంచరీతో చెలరేగాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్కు 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ ఆయూష్ మాత్రే(5) మాత్రం తీవ్రంగా నిరాశపర్చాడు. ఇంగ్లండ్ అండర్ 19 బౌలర్లలో జాక్ హోమ్(4/63) నాలుగు వికెట్లు తీయగా.. సెబాస్టియన్ మోర్గాన్(3/54) మూడు వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ మింటో(1/49), బెన్ మైస్(1/24) చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం ఇంగ్లండ్ అండర్ 19 టీమ్ 45.3 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ దిగ్గజ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాప్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్(91 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 107) సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. డాకిన్స్(67), జోసెఫ్ మూర్స్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత అండర్ 19 బౌలర్లలో నమన్ పుష్పక్(3/63) మూడు వికెట్లు తీయగా.. దీపేష్ దేవండ్రన్, కనిష్క్ చౌహన్ చెరో వికెట్ తీసారు. ఈ సిరీస్లో తొలి వన్డేలో గెలిచిన భారత్.. రెండో మ్యాచ్లో ఓడింది. మూడు, నాలుగు వన్డేల్లో వరుసగా గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూత్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ బ్యాటర్ కమ్రాన్ గులామ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ను అధిగమించాడు. 2013లో ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో జరిగిన మ్యాచ్లో కమ్రాన్ గులామ్ 53 బంతుల్లో శతకం సాధించాడు.తాజా మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ.. 52 బంతుల్లోనే సెంచరీ బాది క్రమాన్ గులామ్ 12 ఏళ్ల రికార్డ్ను అధిగమించాడు. భారత్ తరఫున రాజ్ అంగద్ బవా.. ఉగాండపై 69 బంతుల్లో సెంచరీ చేశాడు. వైభవ్ తాజా శతకంతో ఈ రికార్డ్ కూడా బద్దలైంది. ఈ సిరీస్లో వైభవ్ నాలుగు ఇన్నింగ్స్ల్లో వరుసగా 48(19), 45(34), 86(31), 143(78) పరుగులతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.