ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో జితేశ్ శర్మ సారథ్యంలోని భారత్-ఏ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా టినేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో భారత్-ఏ 148 పరుగుల తేడాతో గెలుపొందింది. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేయడమే కాకుండా విధ్వంసకర సెంచరీతో అందర్నీ సంభ్రమాశ్చర్యానికి గురి చేసిన ఈ బిహార్ కుర్రాడు.. అంతర్జాతీయ వేదికల్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు.
యూఏఈతో మ్యాచ్లో 42 బంతుల్లోనే 144 పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 15 సిక్సర్లతో బౌండరీల సునామీ సృష్టించాడు. అతని అసాధారణ బ్యాటింగ్తో ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా ముగిసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 297 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. వైభవ్తో పాటు కెప్టెన్ జితేష్ శర్మ(32 బంతుల్లో 8 ఫోర్లతో 83 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.

అనంతరం యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులే చేసి ఓటమిపాలైంది. షోయబ్ ఖాన్(41 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో గుర్జన్పీత్ సింగ్(3/18) మూడు వికెట్లు తీయగా.. రమణ్దీప్ సింగ్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. హర్ష్ దూబే(2/12) రెండు వికెట్లు తీసాడు.
ఈ మ్యాచ్లో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(10) నిరాశపర్చినప్పటికీ నమన్ ధీర్(34)తో కలిసి వైభవ్ చెలరేగాడు. రెండో వికెట్కు 163 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 17 బంతుల్లోనే అర్థశతకం సాధించిన వైభవ్.. 32 బంతులకే సెంచరీ అందుకున్నాడు. తనకే సాధ్యమైన బ్యాటింగ్తో వైభవ్ చెలరేగడంతో టీ20ల్లో తొలి డబుల్ సెంచరీ సాధిస్తాడా? అనే సందేహాన్ని కలిగించాడు. కానీ 13వ ఓవర్లో క్యాచ్ ఔటయ్యాడు. దాంతో యూఏఈ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం జరిగే తమ తదుపరి మ్యాచ్లో పాకిస్థాన్ షహీన్స్తో భారత్-ఏ తలపడనుంది.