U19 World Cup 2026: భారత అండర్ 19 జట్టు చరిత్ర సృష్టించింది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో 400 ప్లస్ రన్స్ చేసిన తొలి జట్టుగా రికార్డ్ సాధించింది. అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా 411 పరుగుల భారీ స్కోర్ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించింది.
అండర్ 19 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక స్కోర్ ఇప్పటి వరకు 349/6 . ఈ స్కోర్ కూడా టీమిండియానే నమోదు చేసింది. 2016 అండర్ 19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో నమీబియాపై 349/9 ఈ స్కోర్ నమోదు చేసింది. ఆ మ్యాచ్లో రిషభ్ పంత్(111) సెంచరీతో రాణించాడు. అండర్ 19 ప్రపంచకప్లో టీమిండియాకు ఇది మూడో 400 ప్లస్ స్కోర్. కుర్రాళ్ల ప్రపంచకప్లో అత్యధిక ఛేజింగ్ రికార్డ్ కూడా భారత్ పేరిటనే ఉంది. ఇదే టోర్నీలో అఫ్గానిస్థాన్తో జరిగిన సెమీఫైనల్లో యువభారత్ 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఈ రికార్డ్ అందుకుంది.

ఇంగ్లండ్తో ఫైనల్లో టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్లతో 175) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత అండర్ 19 టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగుల భారీ స్కోర్ చేసింది.
వైభవ్కు తోడుగా కెప్టెన్ ఆయుష్ మాత్రే(51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీ సాధించగా.. అభిజ్ఞాన్ కుండు(40), విహాన్ మల్హోత్రా(30), వేదాంత్ త్రివేది(32), కాన్షిక్(37 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ రెండేసి వికెట్లు తీయగా.. జేమ్స్ మింటో(3/63) మూడు వికెట్లు పడగొట్టాడు. మన్నీ లమ్స్డెన్ ఒక వికెట్ తీసాడు.
వైభవ్ సూర్యవంశీ ధాటికి ఈ మ్యాచ్లో టీమిండియా తొలి 25 ఓవర్లలోనే 250/2 స్కోర్ చేసింది. వైభవ్ ఔటవ్వడంతో పరుగుల వేగం తగ్గగా.. చివరి 25 ఓవర్లలో భారత్ 161/7 స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ 15 సిక్స్లు, 15 ఫోర్ల ద్వారానే 150 పరుగులు చేశాడు. ఈ విధ్వంసకర బ్యాటింగ్తో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గానూ వైభవ్ నిలిచాడు. అతను ఈ టోర్నీలో 439 పరుగులు చేశాడు. టీమిండియా బ్యాటింగ్కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇంగ్లండ్ను గుంజి గుంజి.. గిప్పామ్ గిప్పామ్ కొట్టిందని కామెంట్ చేస్తున్నారు.