అండర్ 19 ప్రపంచకప్ 2026 టోర్నీకి రిహార్సల్గా సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత్ 2 0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. భారత కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో సోమవారం జరిగిన రెండో యూత్ వన్డేలో భారత అండర్ 19 జట్టు డక్ వర్త్ లూయిస్ ప్రకారం 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్గా బరిలోకి దిగిన టీమిండియా టినేష్ సెన్సేషన్ 24 బంతుల్లో ఫోర్, 10 సిక్స్లతో 68 పరుగులతో దుమ్మురేపాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా అండర్ 19 టీమ్ 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. జాసన్ రోల్స్(113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 114) సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో కిషన్ సింగ్(4/46) నాలుగు వికెట్లు తీయగా.. ఆర్ఎస్ అంబ్రీష్(2/47) రెండు వికెట్లు పడగొట్టాడు. దీపేష్ దేవంద్రన్, ఖిలాన్ పటేల్ తలో వికెట్ తీసారు.

అనంతరం భారత అండర్ 19 జట్టు 23.3 ఓవర్లలో 2 వికెట్లకు 176 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు డక్ వర్త్ లూయిస్ పద్దతిన ఫలితాన్ని తేల్చారు. వైభవ్ సూర్యవంశీ(24 బంతుల్లో ఫోర్, 10 సిక్స్లతో 68) విధ్వంసం భారత విజయానికి కలిసొచ్చింది.
ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. తొలి వన్డేను కూడా భారత్ డీఎల్ఎస్ పద్దతిన 25 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే బుధవారం జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానుంది. ఈ సిరీస్ అనంతరం జనవరి 15 నుంచి సౌతాఫ్రికా వేదికగా జరిగే అండర్ 19 ప్రపంచకప్లో భారత్ అండర్ 19 టీమ్ బరిలోకి దిగుతోంది.