టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపుతున్నాడు. 14 ఏళ్లకే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు సెంచరీ బాది అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈ బిహార్ కుర్రాడు.. అంతర్జాతీయ వేదికల్లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతున్నాడు.
యూఏఈపై(42 బంతుల్లో 144) భారీ శతకంతో సిక్సర్ల సునామీ సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. పాకిస్థాన్ బౌలర్లను కూడా చెడుగుడు ఆడాడు. శత్రు దేశం పాకిస్థాన్ అనే బెరుకు లేకుండా ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు. దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీని పాకిస్థాన్ పేసర్ ఉబైద్ షా పదే పదే తన మాటలతో రెచ్చగొడుతూ ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. అతని మాటలకు ఏ మాత్రం బెదరని సూర్యవంశీ అదే రీతిలో బదులిచ్చాడు.

'మూస్కోని బాల్ వేయ్'అని వైభవ్ సూర్యవంశీ అన్న మాటలు స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యాయి. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్లో ఉబైద్ షా వేసిన బంతిని సూర్యవంశీ సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. దాంతో అతను మాటల దాడికి దిగగా.. సూర్యవంశీ పోయి బాల్ వేయ్ అని హిందీలో చెప్పాడు. ఆ మరుసటి బంతినే సూర్యవంశీ బౌండరీకి తరలించి దిమ్మతిరిగే షాకిచ్చాడు.
బంతి బౌండరీ లైన్ను తాకే వరకు తన బ్యాట్ను పైకి ఎత్తి స్టైల్గా ఫోజిచ్చాడు. అతని షాట్కు ఉబైద్ షా నోరు మూసుకొని వెనక్కి వెళ్లిపోయాడు. మరోవైపు సూర్యవంశీ కూడా సహచర ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య వైపు నడిచాడు. అయితే హాఫ్ సెంచరీ ముంగిట సుఫియాన్ ముఖీమ్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి వైభవ్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. బౌండరీ లైన్పై క్యాచ్ పట్టడంతో తీవ్ర నిరాశకు గురైన వైభవ్.. బ్యాట్ను నేలకు కొట్టి అసహనం వ్యక్తం చేశాడు.
అయితే ఈ మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 45), నమన్ ధీర్(20 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 35) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన పాకిస్థాన్ 13.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. మాజ్ సదాఖత్ (47 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 79 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్-ఏ బౌలర్లలో యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మ చెరో వికెట్ తీసారు.