అండర్ 19 వన్డే ప్రపంచకప్ 2026లో టీమిండియా శుభారంభం చేసింది. అమెరికాతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అండర్ 19 ప్రపంచకప్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.
14 ఏళ్ల 294 రోజుల వయసులో వైభవ్ సూర్యవంశీ అండర్ 19 ప్రపంచకప్ బరిలోకి దిగాడు. ఈ క్రమంలో కుమార్ కుశాగ్ర రికార్డ్ను అధిగమించాడు. అతను 15 ఏళ్ల 88 రోజుల వయసులో అండర్ 19 ప్రపంచకప్ ఆడాడు. 2020లో జరిగిన టోర్నీలో అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు. తాజాగా ఈ రికార్డ్ను వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు.
అండర్ 19 ప్రపంచకప్లో వైభవ్ సూర్యవంశీ శుభారంభం అందుకోలేకపోయాడు. అమెరికాతో తొలి మ్యాచ్లో 4 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సూర్య విఫలమైనా ఈ మ్యాచ్లో భారత్ గెలుపొందింది. అభిగ్యాన్ కుండు(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 42 నాటౌట్) భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా అండర్ 19 టీమ్ 35.2 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. నితిష్ సుదిని(52 బంతుల్లో 4 ఫోర్లతో 36) టాప్ స్కోరర్గా నిలిచాడు. హెనిల్ పటేల్(5/16) ఐదు వికెట్లు తీయగా.. దిపేశ్ దేవండ్రన్, అంబ్రిష్, ఖిలాన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ అండర్ 19 టీమ్ 17.2 ఓవర్లలో 4 వికెట్లకు 99 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే(19), వైభవ్ సూర్యవంశీ(2), వేదాంత్ త్రివేది(2), విహాన్ మల్హోత్ర(18) విఫలమవ్వగా.. కాన్షిక్ చౌహన్(10 నాటౌట్)తో కలిసి అభిజ్ఞాన్ కుండ్ భారత్ విజయాన్ని పూర్తి చేశాడు. అమెరికా బౌలర్లలో రిత్విక్ అప్పిడి రెండు వికెట్లు తీయగా.. రిషభ్ షింపి, ఉత్కర్ష్ శ్రీవాస్తవా తలో వికెట్ తీసారు. శనివారం జరిగే తమ తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్తో భారత జట్టు తలపడనుంది.