టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అండర్ 19 ఆసియాకప్లో భాగంగా పాకిస్థాన్తో శనివారం జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగిన ఈ 13 ఏళ్ల బుడ్డోడు.. 21 ఏళ్ల రికార్డును అందుకోవడంతో పాటు పలు ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.
భారత్ అండర్ 19 జట్టుకు ఆడిన అతి పిన్నవయస్కుడిగా సూర్యవంశీ చరిత్రకెక్కాడు. 13 ఏళ్ల 249 రోజుల వయసులో సూర్యవంశీ భారత అండర్ 19 జట్టుకు ప్రాతినిథ్యం వహించి.. వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లా పేరిట ఉన్న రికార్డ్ను అధిగమించాడు.

21 ఏళ్ల రికార్డ్
పియూష్ చావ్లా 14 ఏళ్ల 311 రోజుల వయసులో భారత్ అండర్ 19 జట్టు ప్రాతినిథ్యం వహించాడు. 2003లో పియూష్ చావ్లా ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో కుమార్ కుశాగ్ర మూడో స్థానంలో ఉన్నాడు.ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ 15 ఏళ్ల 30 రోజుల వయసులో భారత అండర్ 19 జట్టుకు ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కుమార్ కుశాగ్రను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
ఐపీఎల్ చరిత్రలోనే..
ఇప్పటికే భారత అండర్ 19 జట్టు తరఫున ఆస్ట్రేలియాతో యూత్ టెస్ట్ మ్యాచ్ ఆడిన వైభవ్ సూర్యవంశీ.. ఈ ఫీట్ సాధించిన యంగెస్ట్ ప్లేయర్గా నిలిచాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు తీసుకున్న విషయం తెలిసిందే.దాంతో ఐపీఎల్ చరిత్రలోనే మెగా వేలంలో అమ్ముడైన అతిపిన్నవయస్కుడిగా ఈ జూనియర్ సూరీడు నిలిచాడు.
నిరాశపర్చిన సూరీడు..
పాకిస్థాన్తో శనివారం జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా నిరాశపరిచాడు. తన వన్డే అరంగేట్రాన్ని ఘనంగా చాటుకోలేకపోయాడు.ఐపీఎల్ 2025 మెగా వేలం తెచ్చిన ఒత్తిడో లేక దాయదీ పాకిస్థాన్ మ్యాచ్ అనో.. తెలియదు కానీ.. 9 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. దాంతో ఈ మ్యాచ్లో భారత్ 43 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
భారత్ ఓటమి..
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ అండర్19 టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 281 పరుగులు చేసింది. షెహ్జైబ్ ఖాన్(147 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 159) సెంచరీతో చెలరేగగా.. ఉస్మాన్ ఖాన్(94 బంతుల్లో 6 ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు.భారత అండర్ 19 బౌలర్లలో సమర్థ్ నాగ్రాజ్(3/45) మూడు వికెట్లు తీయగా.. ఆయుష్ మాత్రే(2/30) రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం భారత అండర్ 19 జట్టు 47.1 ఓవర్లలో 238 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. భారత బ్యాటర్లలో నిఖిల్ కుమార్(77 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 67) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. పాక్ బౌలర్లలో అలీ రాజా(3/36), అబ్దుల్ సుబాన్(2/46), ఫహమ్ ఉల్ హక్(2/41) రెండేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్ను జపాన్తో సోమవారం ఆడనుంది.