టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అండర్ 19 క్రికెట్ చరిత్రలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న అతిపిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. అండర్ 19 ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్లో విన్నింగ్ పెర్ఫామెన్స్ చేయడం ద్వారా వైభవ సూర్యవంశీ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 67 పరుగులతో సత్తా చాటాడు. ఈ చోటా సూరీడి విధ్వంసకర బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

13 ఏళ్ల 254 రోజుల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఇప్పటికే అండర్ 19 క్రికెట్ చరిత్రలోనే ఆడిన అతిపిన్న వయస్కుడిగా నిలిచిన వైభవ్ సూర్యవంశీ.. రికార్డుల మోత మోగిస్తున్నాడు.
వరుసగా 2 హాఫ్ సెంచరీలు..
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 1.10 కోట్లు పలికి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ.. అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. పాకిస్థాన్తో తొలి మ్యాచ్లో ఒక్క పరుగే చేసిన ఈ చోటా సూరీడు.. జపాన్తో 23 పరుగులకే వెనుదిరిగాడు. యూఏఈతో జరిగిన మూడో మ్యాచ్లో మాత్రం తన అసలు సిసలు బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.
శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో అదే జోరు కనబర్చాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ చోటా సూరీడుని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో అమ్ముడైన ఆటగాడిగా ఈ బీహార్ కుర్రాడు రికార్డ్ సాధించాడు
భారత్ సునాయస విజయం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలోలాక్విన్ అబే సింఘే(110 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 69) హాఫ్ సెంచరీతో రాణించగా.. శారుజన్ షణ్ముగనాథన్(78 బంతుల్లో 2 ఫోర్లతో 42) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో చేతన్ శర్మ(3/34) మూడు వికెట్లు తీయగా.. కిరణ్, ఆయుష్ మాత్రే రెండేసి వికెట్లు పడగొట్టారు. యుధజిత్ గుహ, హార్దిక్ రాజ్కు చెరో వికెట్ దక్కింది.
అనంతరం భారత అండర్ 19 జట్టు 21.4 ఓవర్లలోనే 3 వికెట్లకు 175 పరుగులు చేసి 170 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుష్ మాత్రే(28 బంతుల్లో 7 ఫోర్లతో 34) రాణించాడు. కెప్టెన్ మహమ్మద్ అమాన్(26 బంతుల్లో 2 ఫోర్లతో 25 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. శ్రీలంక బౌలర్లలో విహాస్, విరన్, ప్రవీణ్ తలో వికెట్ తీసారు.
పాకిస్థాన్ ఔట్..
డిసెంబర్ 10న దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తలపడనుంది. పాకిస్థాన్తో జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.