టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మరోసారి దుమ్మురేపాడు. అండర్ 19 ప్రపంచకప్కు సన్నాహకంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్ మూడో మూడో మ్యాచ్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సెంచరీతో చెలరేగాడు. తనదైన విధ్వంసకర బ్యాటింగ్తో 63 బంతుల్లోనే శతకం సాధించాడు. 74 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్లతో 127 పరుగులు చేశాడు.
అతనికి తోడుగా ఆరోన్ జార్జ్(106 బంతుల్లో 16 ఫోర్లతో 118) సెంచరీతో చెలరేగడంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ అండర్ 19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 393 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంటాండో సోని(3/61) మూడు వికెట్లు తీయగా.. జాసన్ రోల్స్(2/59) రెండు వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ అండర్ 19 జట్టుకు ఓపెనర్లు ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్ 63 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. 171.62 స్ట్రైక్రేట్తో 10 సిక్స్లు, 9 ఫోర్లతో వీరవిహారం చేశాడు. భారీ షాట్ ఆడే క్రమంలో అతను క్యాచ్ ఔటవ్వడంతో తొలి వికెట్కు నమోదైన 227 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కాసేపటికే ఆరోన్ జార్జ్ ఔటవ్వగా.. వేదాంత్ త్రివేది(34), మోహమద్ ఇనామ్(19 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 28 నాటౌట్) రాణించారు.
ఇప్పటికే ఈ సిరీస్ను భారత అండర్ 19 టీమ్ 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ వరుసగా 11, 68, 127 పరుగులతో రాణించాడు. ఈ సిరీస్కు ముందు బిహార్ తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడిన వైభవ్ సూర్యవంశీ.. అరుణాచల్ ప్రదేశ్పై 190 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతని ధాటికి లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే బిహార్ రికార్డ్ స్కోర్ నమోదు చేసింది.