తాను బౌలర్ను చూడనని, బంతిని మాత్రమే చూసి ఆడుతానని రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. దాంతోనే ఎంత పెద్ద బౌలర్ను అయినా అలవోకగా ఆడగలుగుతున్నానని చెప్పాడు. తనకు ఏ బౌలర్ అయినా ఒక్కటేనని, బంతి తన జోన్లో ఉంటే బౌండరీ తరలిస్తానని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శుక్రవారం గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ బెస్ట్ బౌలర్లు అయిన జోష్ హజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో బౌండరీల మోత మోగించాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన వైభవ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రాజస్థాన్ రాయల్స్ జట్టులో తన మెంటార్ రోహిత్(సపోర్ట్ స్టాఫ్) అని తెలిపాడు. 'ఈ రాత్రికి కూడా కేక్ కట్ చేయడం లేదు. రేపు పొద్దున్నే మాకు ఫ్లైట్ ఉంది. త్వరగా బయలుదేరాలి కాబట్టి త్వరగా పడుకోవాలి. నేను ప్రాక్టీస్లో ఏమి చేస్తానో.. మైదానంలో కూడా అలానే ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఎక్స్ట్రా ఏది చేయాలని అనుకోను.
కేవలం నా సహజసిద్ధమైన ఆటనే ఆడుతాను. బౌలింగ్ చేస్తోంది ఎవరు అనేది మనసులో వెంటాడుతుంది. కానీ నేను బౌలర్ను చూడకుండా కేవలం బాల్ను మాత్రమే చూసి ఆడేందుకు ప్రయత్నిస్తాను. అందుకే ఎంత పెద్ద బౌలర్ అయినా నేను భయపడను.
నా మెంటార్స్లో మా నాన్నగారు ఒకరు. అలాగే నా కోచ్లు కూడా. ఈ జట్టులో నా సంరక్షకులు రోహిత్ సర్. ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైనదని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని వారందరూ నాకు తరుచూ చెబుతుంటారు. అందుకే ఇటు అటు చూడకుండా కేవలం నా పని మీద, ఆట మీద, ప్రక్రియ మీద దృష్టి పెట్టాలని వారు సూచిస్తుంటారు.
నేను క్రీజులో ఉంటే మరో 10-20 పరుగులు అదనంగా వచ్చేవి. లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు నేను కాసేపు ఉంటే మరో రెండు ఓవర్ల ముందే మ్యాచ్ ముగించేవాళ్లం. ముందుగా బౌలింగ్ చేస్తే.. మరికొన్ని పరుగులు లక్ష్యానికి జోడిస్తాను. అందుకే ఒక లూజ్ షాట్ ఆడి ఔట్ అయినప్పుడు నాకు బాధ కలుగుతుంది. ఇంకాసేపు ఆడి ఉండాల్సిందని నిరాశకు లోనవుతాను.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్(40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. విరాట్ కోహ్లీ(16 బంతుల్లో 7 ఫోర్లతో 32), వెంకటేశ్ అయ్యర్(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 29 నాటౌట్) పర్వాలేదనిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/33), రవి బిష్ణోయ్(2/32), బ్రిజేశ్ శర్మ(2/37) రెండేసి వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ(1/47), రవీంద్ర జడేజా(1/14) చెరో వికెట్ తీసారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 18 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీ(26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78), ధ్రువ్ జురెల్(43 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 81 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(2/44), కృనాల్ పాండ్యా(2/30) రెండేసి వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు చేతులెత్తేసారు.