భారత క్రికెట్ నియంత్ర మండలి(బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా మాజీ రంజీ క్రికెటర్, తెలుగు తేజం వాకిన చాముండేశ్వరనాథ్ ఎన్నికయ్యారు. భారత క్రికెటర్ల అసోసియేషన్(ఐసీఏ) ప్రతినిధిగా ఎంపికవ్వడంతో ఆయనకు ఈ అవకాశం దక్కింది. బుధ, గురువారాల్లో జరిగిన ఐసీఏ ఈ-ఓటింగ్లో చాముండేశ్వరనాథ్కు రికార్డ్ స్థాయిలో మద్దతు లభించింది. చాముండేశ్వరనాథ్కు మొత్తం 755 ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి రాజేశ్ జడేజాకు 83 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 838 మంది క్రికెటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు.
బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో చాముండి ఐసీఏ ప్రతినిధిగా మూడేళ్లు కొనసాగనున్నారు. మహిళా క్రికెటర్ల తరఫున సుధా షాకు ఈ అవకాశం దక్కింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో ఐసీఏ ప్రతినిధిగా శుభాంగి దత్తాత్రేయ కులకర్ణి ఎంపికయ్యారు.

ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన చాముండేశ్వరి నాథ్.. ఆంధ్ర జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. 1978-92 మధ్య కాలంలో మొత్తం 14 సీజన్ల పాటు దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 44 ఫస్ల్ క్లాస్ మ్యాచ్ల్లో 1818 పరుగులు చేశారు. ఇందులో 4 శతకాలతో పాటు 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆంధ్ర జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించారు. ఆటగాడిగా వీడ్కోలు పలికిన అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)తో పాటు బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో పలు పదవులు చేపట్టాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2009లో భారత జట్టుకు మేనేజర్గా పని చేశారు. బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్గా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో సెక్రటరీ, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్, ఆంధ్ర అండర్ 19, మహిళల జట్ల సెలెక్టర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. వ్యాపార వేత్త అయిన చాముండీ.. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్లో ముంబై మాస్టర్స్ జట్టుకు కో ఓనర్గా ఉన్నారు. హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్తో పాటు తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు చాముండీ మంచి స్నేహితుడు. అంతర్జాతీయంగా సత్తా చాటే ఆటగాళ్లకు చాముండీ ఖరీదైన కార్లను బహుమతిగా అందిస్తూ వారిని మరింత ప్రోత్సహిస్తాడు.