భారత బ్యాటర్లు ఇచ్చిన కీలకమైన క్యాచ్లను వదిలేయడం వల్లే ఓటమి పాలయ్యామని అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ అన్నాడు. తమ బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో భారత్ను తక్కువ స్కోర్కే కట్టడి చేశారని, కానీ తమ టాప్-3 బ్యాటర్ల వైఫల్యం విజయవకాశాలను దెబ్బతీసిందని తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా టీమిండియాతో వాంఖడే వేదికగా శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్లో అమెరికా 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్(49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 84 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాక్విక్(4/25) నాలుగు వికెట్లు తీయగా.. హర్మీత్ సింగ్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. అలీ ఖాన్(1/13), మహమ్మద్ మోహ్సిన్(1/16) తలో వికెట్ తీసారు.
అనంతరం అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేసి ఓటమిపాలైంది. మిలింద్ కుమార్(34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 34), సంజయ్ కృష్ణమూర్తి(31 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/29) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/22), అర్ష్దీప్ సింగ్(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. వరుణ్ చక్రవర్తీ ఒక వికెట్ దక్కింది.

ఈ మ్యాచ్లో 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను శుభమ్ రంజనే అందుకోలేకపోయాడు. ఈ క్యాచ్ అందుకొని ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఈ మ్యాచ్ అనంతరం మోనాంక్ పటేల్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.
'మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఇక్కడి పరిస్థితులను, పిచ్ను వారు అంచనా వేసిన తీరు మాకు మంచి మంచి మూమెంటమ్తో పాటు శుభారంభాన్ని అందించింది. అయితే మేం కొన్ని క్యాచ్లు వదిలేశాం. ఆ తప్పిదం మాకు ఒటమిని మిగిల్చింది. ఈ పిచ్పై 160 పరుగులు మంచి స్కోర్ అని, ఈజీగా ఛేదించవచ్చని భావించాను. కానీ మా టాప్-3 బ్యాటర్ల వైఫల్యం మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్లో ఓడినా చాలా విషయాలు నేర్చుకున్నాం. అనేక సానుకూల అంశాలను తీసుకున్నాం. ఈ ప్రదర్శన భవిష్యత్తులో మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.'అని మోనాంక్ పటేల్ చెప్పుకొచ్చాడు.