వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 మెగా వేలంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మకు జాక్పాట్ ధర దక్కింది. వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన దీప్తి శర్మను తన పాత ఫ్రాంచైజీ యూపీ వారియర్స్ రూ.3.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న డబ్ల్యూపీఎల్ తొలి మెగా వేలంలో ఆర్టీఎమ్ (రైట్ టు మ్యాచ్) కార్డు ద్వారా దీప్తి శర్మను యూపీ వారియర్స్ రిటైన్ చేసుకుంది. రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన దీప్తి శర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్ వేయగా.. ఇతర ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. అయితే యూపీ వారియర్స్ రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ దీప్తి శర్మ కోసం రూ.3.20 కోట్లతో బిడ్ వేసింది. ఆ ధరను చెల్లించేందుకు యూపీ వారియర్స్ అంగీకరించడంతో దీప్తి శర్మ ఆ జట్టు సొంతమైంది.

గత సీజన్లో దీప్తి శర్మకు యూపీ వారియర్స్ రూ. 2.60 కోట్లు చెల్లించింది. కానీ మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకోకుండా వదిలేసిన యూపీ వారియర్స్ చివరకు రూ.3.20 కోట్లకు ఆర్టీఎమ్ ద్వారా తిరిగి జట్టులోకి తీసుకుంది . దాంతో డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన రెండో ప్లేయర్గా దీప్తి శర్మ నిలిచింది. గతంలో స్మృతి మంధానను ఆర్సీబీ రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది. మహిళల వన్డే ప్రపంచకప్లో దీప్తి శర్మ అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె ఈ టోర్నీలో 215 పరుగులతో పాటు 22 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది.
డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇదే తొలి మెగా ఆక్షన్ కాగా.. మల్లికా సాగర్ ఆక్షనీర్గా వ్యవహరిస్తోంది. ఆస్ట్రేలియా క్రికెటర్ అలీసా హీలీతో మెగా వేలం ప్రారంభం కాగా.. ఆమెను తీసుకోవడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. దాంతో ఆమె తొలి రౌండ్లో అన్సోల్డ్గా నిలిచింది. ప్రస్తుతం అలీసా హీలీ గాయంతో బాధపడుతుండటంతో ఫ్రాంచైజీలు ఆమెను పట్టించుకోలేదని తెలుస్తోంది.
న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ను గుజరాత్ జెయింట్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేయగా.. కివీస్కే చెందిన అమెలియా కేర్ను ముంబై ఇండియన్స్ రూ.3 కోట్లకు తీసుకుంది. భారత పేసర్ రేణుకా సింగ్ను గుజరాత్ జెయింట్స్ రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ ఎక్లిస్టోన్ను రూ.85 లక్షలకు యూపీ వారియర్స్ ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా రిటైన్ చేసుకుంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్ట్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది.