ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ బ్యాటర్ అన్మోల్ ప్రీత్ సింగ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 35 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. తద్వారా లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్తో శనివారం జరిగిన మ్యాచ్లో అన్మోల్ ప్రీత్ సింగ్ ఈ ఫీట్ సాధించాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో అన్మోల్ ప్రీత్ సింగ్ను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దాంతో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన అన్మోల్ ప్రీత్ సింగ్.. చివరగా సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఇప్పటి వరకు 9 ఐపీఎల్ మ్యాచ్ల్లో 139 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అన్సోల్డ్గా నిలిచాననే కసో ఏమో కానీ.. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. 45 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్స్లతో 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లను చెడుగుడు ఆడాడు.

అన్మోల్ ప్రీత్ సింగ్ సంచలన బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో పంజాబ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ 164 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ బౌలర్లలో మయాంక్ మార్కండే, అశ్వని కుమార్ మూడేసి వికెట్లు తీయగా.. బల్జీత్ సింగ్ 2, సన్వీర్ సింగ్, రఘు శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ అన్మోల్ ప్రీత్ సింగ్ విధ్వంసంతో 12.5 ఓవర్లలో 167 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన అన్మోల్ ప్రీత్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అన్మోల్ ప్రీత్ సింగ్కు తోడుగా ప్రభ్సిమ్రాన్ సింగ్(25 బంతుల్లో 35 నాటౌట్) రాణించాడు. అభిషేక్ శర్మ(10) తీవ్రంగా నిరాశపరిచాడు.