
కష్టంగా గడిచింది..
తాజాగా స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గల కారణాలను ఈ యువ క్రికెటర్ వెల్లడించాడు. 'గత రెండేళ్లు చాలా కష్టంగా గడిచింది. చివరి సీజన్లో ఢిల్లీ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. టీమ్లో సహచరులు కనీసం నన్ను గుర్తించలేదు. వారంతా మైదానంలో ఆడుతుంటే.. నేను డగౌట్కు పరిమితమవ్వాల్సి వచ్చింది. ఒంటరిగా పెవిలియన్లో కూర్చొవడం మానసిక క్షోభలా అనిపించింది. ఇది మెంటల్గా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. రానురాను ఇక అవకాశాలు వస్తాయో లేదో అని రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది'అని ఉన్ముక్త్ చంద్ చెప్పుకొచ్చాడు.

అన్నీ ఆలోచించే..
విదేశీ లీగ్ల కోసం యూఎస్ను ఎంచుకోవడంపై ఉన్ముక్త్ స్పందించాడు. అక్కడి పరిస్థితులు అన్ని అంచనా వేశాకే ఓ నిర్ణయానికి వచ్చానని పేర్కొన్నాడు. 'మూణ్నెళ్ల క్రితం అమెరికా వెళ్లినప్పుడు అక్కడి క్రికెట్ను దగ్గర నుంచి చూశాను. పలు మ్యాచ్లు ఆడాను. అక్కడి ఆటపై ఓ స్పష్టత వచ్చాక ఆడాలనుకున్నా. ఇప్పటికే కోరె అండర్సన్, స్మిత్ పటేల్, హర్మీత్ సింగ్ వంటి ప్లేయర్లు యూఎస్ లీగ్లలో ఆడుతున్నారు' అని పేర్కొన్నాడు. గతంలో ఆటలో అవకాశాలు రానప్పుడు చాలా కష్టంగా ఉండేదని ఉన్ముక్త్ తెలిపాడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఇబ్బంది పడేవాడినని పేర్కొన్నాడు. క్రికెట్కు వీడ్కోలు ప్రకటించాక కాస్త ఉపశమనంగా అనిపించిందని తెలిపాడు. ఇప్పుడు తాను చేయాల్సిన పనిపై స్పష్టత వచ్చిందని పేర్కొన్నాడు.

21 మ్యాచ్లాడి 300 పరుగులు:
2012 అండర్-19 ప్రపంచకప్ తర్వాత భారత-ఎ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఉన్ముక్త్ చంద్.. రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. కెప్టెన్గా కూడా టీమ్ని ముందుండి నడిపించాడు. ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్లోనూ దాదాపు ఎనిమిది సీజన్లు ఆడిన ఉన్ముక్త్.. ఆ టీమ్కి కెప్టెన్గా కూడా పనిచేశాడు. కానీ 2017 విజయ్ హజారే ట్రోఫీ ముంగిట అతనిపై వేటు పడగా.. ఆ తర్వాత 2019లో అతను ఉత్తరాఖండ్ టీమ్కి మారాడు. మళ్లీ మనసు మార్చుకుని ఢిల్లీ జట్టులోకి వచ్చేశాడు. అయితే 2020-21 సీజన్లో మాత్రం అతనికి ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కలేదు. అలానే 2011 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న ఉన్ముక్త్.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ టీమ్కి ప్రాతినిథ్యం వహించాడు. ఇన్నేళ్లలో కేవలం 21 మ్యాచ్లాడి 300 పరుగులు చేశాడు.

అదృష్టం కలిసిరాక..
టీమిండియాకి రెండు సార్లు ఎంపికయ్యేలా కనిపించిన ఉన్ముక్త్ చంద్కి అదృష్టం ఏమాత్రం కలిసిరాలేదు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్కప్కి ఎంపిక చేసిన 30 మంది ప్రాబబుల్స్లో చంద్కి చోటు దక్కింది. కానీ భారత్ తుది జట్టులో మాత్రం అవకాశం రాలేదు. దాంతో 28 ఏళ్ల ఈ ఢిల్లీ క్రికెటర్ కెరీర్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడకుండానే ముగిసింది. 2012 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత కెప్టెన్గా ఉన్ముక్త్ చంద్ (111 పరుగులు నాటౌట్) వీరోచిత సెంచరీతో టీమిండియాకు కప్ అందించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.


Click it and Unblock the Notifications
