
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కథ ముగిసిన విషయం తెలిసిందే. వరుసగా 5 విజయాలతో ఆశలు రేకెత్తించిన రాహుల్ సేన.. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన కీలక పోరులో ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. అయితే ఆ జట్టు బ్యాట్స్మన్ క్రిస్ గేల్ సోమవారం ఓ ఆసక్తికర ట్వీట్తో అభిమానులను అయోమయానికి గురి చేశాడు.
'నా సీజన్ పూర్తయినా.. మీరంతా ఈ టీ20 లీగ్ను వీక్షిస్తూ తరించండి'అని పేర్కొంటూ ధన్యవాదాలు తెలిపాడు. దాంతో గందరగోళానికి గురైన గేల్ అభిమానులు.. యూనివర్స్ బాస్ రిటైర్ అవుతున్నట్లు భావించి అలా చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. 'అయితే, మీరు రిటైర్ అవుతున్నారా? దయచేసి అలా చేయొద్దు' అని ఒకరంటే.. 'మీరు ఇంకొన్ని సీజన్లు ఆడాలి' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'మీరు మళ్లీ వచ్చి మమ్మల్ని అలరించాలని, ఈ ఒక్క సీజనే పూర్తయింది' అని విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతో గేల్ రిటైర్మెంట్ వ్యవహారం చర్చనీయాంశమైంది.
ఈ సీజన్లో 7 మ్యాచ్లే ఆడిన యూనివర్స్ బాస్ 288 పరుగులు సాధించాడు. వయసు పెరిగినా ఇంకా తనలో పరుగులు చేసే సత్తా ఉందని నిరూపించాడు. మొత్తం మూడు హాఫ్ సెంచరీలతో పాటు రాజస్థాన్పై 99 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఒక్క పరుగు దూరంలో ఔటైన ఈ విండీస్ వీరుడు ఈ లీగ్లో ఏడో శతకాన్ని కోల్పోయాడు. అయితే, సీజన్ ఆరంభం నుంచీ గేల్ ఆడి ఉంటే పంజాబ్ కథ మరోలా ఉండేదని ఆ జట్టు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.