
పాక్తో మ్యాచ్ రద్దు చేయాలి..
తాజాగా మరో కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే సైతం పాకిస్థాన్తో మ్యాచ్ ఆడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ చానెల్తో మాట్లాడిన అథవాలే.. ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడుతానన్నాడు. 'ప్రస్తుతం కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ ఆగడాలను అణిచివేసేందుకు భారత ప్రభుత్వం ఆ దేశంపై యుద్ధం ప్రకటించాలి. పాక్తో మంచి సంబంధాలు కొనసాగించాలని భారత ప్రభుత్వం, ప్రధాని భావిస్తున్నప్పటికీ.. వారి ఉగ్ర చర్యలు ఆగడంలేదు. ఆ దేశంపై అంతిమ యుద్ధం ప్రకటించాలి. ప్రస్తుతం పాక్తో టీ20 మ్యాచ్ను నిలిపివేయాలి. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తా' అని పేర్కొన్నారు.

ఆమ్ ఆద్మీ సైతం..
పాకిస్థాన్తో మ్యాచ్పై ఆమ్ ఆద్మీ పార్టీ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. దాయాదీ దేశంతో మ్యాచ్ ఆడేందుకు టీమిండియా నిరాకరించాలని ఆప్ మహిళా ఎమ్మెల్యే అతిషీ కోరారు. భారత్లో పాక్ ఉగ్రదాడులు ఆగిపోయేంతవరకు ఆ దేశంతో క్రికెట్ మ్యాచ్లు ఆడకూడదని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన డిమాండ్కు మద్దతిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.
భారత పౌరుల జీవితాలతో పాకిస్థాన్ నిత్యం 20-20 ఆడుతుంటే ఆ దేశంతో క్రికెట్ మ్యాచ్ ఆడుతారా? అని ఒవైసీ నిలదీశారు. 'జమ్మూకశ్మీర్లో గత కొంతకాలంగా జరుగుతోన్న ఉగ్ర దాడుల్లో ఇప్పటివరకు తొమ్మిదిమంది సైనికులు అమరులయ్యారు. భారత పౌరుల జీవితాలతో పాకిస్థాన్ నిత్యం 20-20 ఆడుతోంది. ఇలాంటి సమయంలో అక్టోబర్ 24న పాకిస్థాన్తో భారత్ టీ20 మ్యాచ్ ఆడబోతోంది. సైనికులు మరణిస్తున్నా పాకిస్థాన్తో టీ20 ఆడతారా?' అని ఒవైసీ ప్రశ్నించారు.

ఇప్పుడు రద్దు చేయడం కుదరదు..
ఈ మెగా మ్యాచ్ను రద్దు చేయాలన్న డిమాండ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించాడు. ఉగ్రవాదుల దాడులను ఖండించిన అతను.. మ్యాచ్ను రద్దు చేయడం కుదరదని స్పష్టం చేశాడు. ''జమ్మూ కశ్మీర్లో జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక మ్యాచ్ విషయానికొస్తే... ఐసీసీకి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం.. ఏదేని ఒక జట్టుతో మేము మ్యాచ్ ఆడలేమని తిరస్కరించే వీలులేదు. ఐసీసీ టోర్నమెంట్లో కచ్చితంగా ఆడాల్సిందే'' అని స్పష్టం చేశారు.

వలస కూలీలే లక్ష్యంగా..
గతకొన్ని రోజులుగా కశ్మీర్లో సాధారణ ప్రజలపై ఉగ్రదాడులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. బిహార్, ఉత్తర్ప్రదేశ్ నుంచి వచ్చిన కూలీలను శ్రీనగర్, పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదులు హత్యచేశారు. ఇలా గడిచిన నాలుగు వారాల్లోనే ఐదుగురు స్థానికేతరులను ఉగ్రవాదులు చంపేయడం అక్కడి వలస కూలీల్లో ఆందోళనకు కారణమవుతోంది.
ముఖ్యంగా చిరు వ్యాపారులు, వలస కూలీలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేస్తుండడంతో ఇతర రాష్ట్రాల ప్రజలు తిరిగి వారి స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా ఉగ్రవాదులు 11 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పాక్తో క్రికెట్ రద్దు చేయాలనే డిమాండ్ వ్యక్తమైంది. సోషల్ మీడియా వేదికగా #BanPakCricket ట్యాగ్ ట్రెండ్ అయింది.


Click it and Unblock the Notifications












