అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో భారత్ జోరు కొనసాగుతోంది. పాకిస్థాన్తో ఆదివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత అండర్ 19 జట్టు 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్ ఆరోన్ జార్జ్ అద్భుత బ్యాటింగ్తో పాటు దీపేష్ దేవంద్రన్(3/16), కాన్షిక్ చౌహన్(3/33) అసాధారణ బౌలింగ్ ప్రదర్శన టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(5) తీవ్రంగా నిరాశపర్చగా.. ఆరోన్ జార్జ్(88 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 85) హాఫ్ సెంచరీతో భారత్ను ఆదుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ సయ్యమ్, నిఖబ్ షఫీక్ మూడేసి వికెట్లు తీయగా.. నిఖబ్ షఫీక్ రెండు వికెట్లు పడగొట్టాడు. అలీరాజా, అహ్మద్ హుస్సేన్కు తలో వికెట్ దక్కింది.
అనంతరం పాకిస్థాన్ 41.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. పాకిస్థాన్ అండర్ 19 బ్యాటర్లలో హజైఫా అషన్(83 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో దీపేష్ దేవంద్రన్(3/16), కాన్షిక్ చౌహన్(3/33) మూడేసి వికెట్లు తీయగా.. కిషన్ సింగ్(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. ఖిలన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో గ్రూప్-ఏలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మలేషియాతో మంగళవారం భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.

లక్ష్యఛేదనలో పాకిస్థాన్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. భారత బౌలర్లు నిప్పులు చెరగడంతో పాక్ ఓపెనర్లు ఉస్మాన్ ఖాన్, సమీర్ మిన్హాస్ పూర్తిగా డిఫెన్స్కే పరిమితమయ్యారు. పరుగులు చేసేందుకు తీవ్రంగా తడబడ్డారు. చివరకు దీపేష్ అద్భుత బౌలింగ్తో సమీర్ మిన్హాస్(9) క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. పాక్ ఓపెనర్ల జిడ్డు బ్యాటింగ్తో పవర్ ప్లేలో ఆ జట్టు వికెట్ నష్టానికి 23 పరుగులే చేసింది.
ఆ వెంటనే దీపేష్ వరుస ఓవర్లలో అలీ హసన్(0), అహ్మద్ హుస్సేన్(4)లను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీసాడు. జిడ్డుగా ఆడుతున్న ఉస్మాన్ ఖాన్(16)ను చౌహన్ క్యాచ్ ఔట్ చేయడంతో పాక్ 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్(23), హుజైఫా అషన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 47 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని వైభవ్ సూర్యవంశీ విడదీసాడు. కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్(23)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన హంజా జహూర్(4), అబ్దుల్ సుభాన్(6) తీవ్రంగా నిరాశపర్చగా.. హాఫ్ సెంచరీ సాధించిన హుజైఫ్ అహ్సన్(70)ను చౌహన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో పాక్ ఓటమి ఖాయమైంది. మహమ్మద్ సయ్యమ్, నిఖబ్ షఫీక్ కూడా ఔటవ్వడంతో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది.