అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నీలో యువ భారత్ జోరు కొనసాగుతోంది. దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు 315 పరుగుల భారీ తేడాతో మలేషియాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో హ్యాట్రిక్ విక్టరీని ఖాతాలో వేసుకున్న భారత్.. గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిజ్ఞాన్ కుందు(125 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్లతో 209 నాటౌట్) అజేయ డబుల్ సెంచరీతో చెలరేగగా.. వైభవ్ సూర్యవంశీ(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మలేషియా బౌలర్లలో ముహమ్మద్ అక్రమ్(5/89) ఐదు వికెట్లు తీయగా.. సత్నకుమారన్, కృష్ణమూర్తి చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం మలేసియా 32.1 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత బౌలర్లలో దీపేష్ దేవంద్రడన్(5/22) ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. ఉధవ్ మోహన్ రెండు వికెట్లు తీసాడు. క్రిషన్ సింగ్, ఖిలన్ పటేల్, కానిష్క్ చౌహన్ చెరో వికెట్ తీసారు.
గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాయి. గ్రూప్-బీలో రెండో స్థానంలో నిలిచే జట్టుతో భారత్ శుక్రవారం తొలి సెమీఫైనల్ ఆడనుంది. గ్రూప్-బీ టాపర్తో పాకిస్థాన్ రెండో సెమీఫైనల్లో తలపడనుంది. పాకిస్థాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఇరు జట్లు ఫైనల్ చేరితే మరోసారి తలపడనున్నాయి.