
ముంబై: పాకిస్థాన్ దిగ్గజ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన రికార్డును ఏదో ఒక రోజు అధిగమిస్తానని టీమిండియా యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అన్నాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే తనకు మరింత ముఖ్యమని చెప్పిన ఈ కశ్మీర్ ఎక్స్ప్రెస్.. లైన్ లెంగ్త్పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపాడు. మంగళవారం నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్లకు ఎంపికైన ఉమ్రాన్ మాలిక్.. ఓ జాతీయ చానెల్తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'అదృష్టవశాత్తూ నేను మెరుగ్గా రాణిస్తే షోయబ్ అక్తర్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ బాల్ రికార్డు బద్దలు కొడతాను. అయితే, నేను రికార్డుల కంటే జట్టు ప్రయోజనాల గురించే ఆలోచిస్తున్నా. వాస్తవానికి మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎంత వేగంగా బంతిని విసిరామనే సంగతి తెలియదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే ఈ విషయాలు తెలుసుకోగలుగుతాం. నా ధ్యాస.. ఎంత వేగంతో బంతిని విసురుతున్నామన్న అంశం మీద కాకుండా సరైన ఏరియాలో బంతి పడుతుందా లేదా? అనేదానిపైనే ఉంటుంది'అని ఉమ్రాన్ మాలిక్ చెప్పుకొచ్చాడు.
ఇక ఫాస్టెస్ట్ బాల్ రికార్డు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. 2003 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్తో మ్యాచ్లో అతను గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఇక ఉమ్రాన్ మాలిక్ నిలకడగా గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతిని విసరగలుగుతున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్లో అతను 157 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఇదే మాలిక్కు ఫాస్టెస్ట్ రికార్డుగా ఉంది. వేగవంతమైన బంతులతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్.. అనతి కాలంలోనే భారత జట్టులో కీలకమయ్యాడు. అప్కమింగ్ వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ల్లో కీలకంగా ఉన్న మాలిక్ను మేటి పేసర్గా తీర్చిదిద్దాలని టీమ్మేనేజ్మెంట్ భావిస్తోంది.