
కటక్: టీమిండియా తాత్కలిక సారథి రిషభ్ పంత్కు యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన పేస్తో చుక్కలు చూపించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్కు ఎంపికైన ఈ కశ్మీర్ ఎక్స్ప్రెస్ వేగానికి పర్యాయపదంగా మారుతున్నాడు. తన బౌలింగ్ టెక్నిక్తో క్రీడా పండితుల ప్రశంసలు అందుకుంటున్న ఈ యువ పేసర్ గంటకు కనీసం 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్-2022లో 14 సార్లూ 'ఫాస్టెస్ట్ బాల్' అవార్డు గెలుచుకున్న ఉమ్రాన్ మొత్తంగా 22 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నేపథ్యంలో తొలిసారిగా జాతీయ జట్టు పిలుపును అందుకున్న ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ అరంగేట్ర కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అతన్ని బెంచ్కే పరిమితం చేస్తున్నాయి. అయినప్పటికీ, ఉమ్రాన్ పేరు క్రికెట్ ప్రేమికుల నోళ్లలో నానుతూనే ఉంది. అతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వీటి ఆధారంగా.. ప్రాక్టీసు సెషన్లో భాగంగా గంటకు సుమారు 160కి పైగా వేగంతో బంతులు విసిరినట్లు తెలుస్తోంది. ఉమ్రాన్ వేగానికి టీమిండియా యువ క్రికెటర్, ప్రస్తుత సిరీస్ కెప్టెన్ రిషభ్ పంత్ బ్యాట్ విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ సిరీస్కు విశ్రాంతి పేరిట రోహిత్ శర్మ దూరం కాగా.. కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే అనూహ్యంగా అతను చివరి నిమిషంలో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దాంతో పంత్ తాత్కలిక సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. గత గురువారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది.
జూన్ 12న కటక్ వేదికగా జరుగనున్న రెండో మ్యాచ్కు సన్నద్ధమవుతోంది.