ఇంతకేం జరిగిందంటే..?
158 పరుగుల లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ ఆరంభంలో తడబడినా.. మయాంక్ సూపర్ ఇన్నింగ్స్తో విజయం ముంగిట నిలిచింది. ఆ జట్టు విజయానికి 12 బంతుల్లో 25 పరుగుల కావాల్సిన క్రమంలో రబడా 19వ ఓవర్ అందుకున్నాడు. క్రీజులో మయాంక్, క్రిస్ జోర్డాన్ ఉన్నారు. తొలి బంతిని డాట్ చేసిన అగర్వాల్ రెండో బంతిని ఫోర్ కొట్టాడు. ఇక మూడో బంతి ఎక్స్ట్రా కవర్ రీజియన్ వైపు ఆడి క్విక్ డబుల్ తీశాడు. అయితే లెగ్ అంపైర్ నితీన్ మీనన్.. క్రిస్ జోర్డాన్ పరుగులు పూర్తి చేయలేదని ఓ రన్ షార్ట్ చేశాడు. అయితే టీవీ రిప్లేలో మాత్రం అతను లైన్మీదనే బ్యాట్ పెట్టినట్లు స్పష్టమైంది. ఈ పరుగే ఆ జట్టు చేసి ఉంటే పంజాబ్ సూపర్ ఓవర్ అవసరం లేకుండానే గెలిచేది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలి...
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. సదరు అంపైర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలని, భారత మాజీ క్రికెటర్, కింగ్స్ పంజాబ్ మాజీ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ట్విటర్ వేదికగా ఈ షార్ట్ రన్కు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు. ‘అంపైర్ తీసుకున్న నిర్ణయంతో నేను ఏకీభవించడం లేదు. షార్ట్ రన్ ఇచ్చిన ఇతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలి. అది షార్ట్ రన్ కానే కాదు'అని కామెంట్ చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు.
అంపైర్ తప్పిదే పంజాబ్ ఓటమికి కారణం...
ఇక అంపైర్ తప్పుడు నిర్ణయం తీవ్ర దుమారం రేపుతుంది. సరైనదేనని కొందరంటే.. తప్పడు నిర్ణయమని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి పంజాబ్ మాత్రం ఓ తప్పుడు నిర్ణయానికి బలైందని, మయాంక్ అద్బుత పోరాటానికి విలువ లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంపైర్కు కళ్లు పోయాయని కామెంట్ చేస్తున్నారు. థర్డ్ అంపైర్తో సమీక్షించుకోవచ్చు కదా అని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ఘోరాలు ఇంకెన్ని చూడాలో అని కామెంట్ చేస్తున్నారు. అసలు థర్డ్ అంపైర్ ఎందుకు నిర్ణయం తీసుకోవద్దని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ ఐపీఎల్ రూల్సే మార్చేయాలంటున్నారు.
అటు స్టోయినీస్..ఇటు మయాంక్
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్ల ధాటికి ఆ జట్టు ఓ దశలో 120 పరుగులకే పరిమితమవుతుందా? అనిపించింది. కానీ చివర్లో స్టోయినిస్( 21 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స్లతో 53 ) సూపర్ ఫిఫ్టీతో మెరుపులు మెరిపించడంతో పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఆఖరి ఓవర్లోనే ఆ జట్టు 30 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కింగ్స్ పంజాబ్.. మయాంక్ అగర్వాల్(60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 89) వీరోచిత ఇన్నింగ్స్తో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 157రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు దారి తీసింది. ఓటమి దశ నుంచి గెలుపు ముంగిట నిలిపిన మయాంక్ ఆ లాంఛనాన్ని మాత్రం పూర్తి చేయలేకపోయాడు.


Click it and Unblock the Notifications












