PAK vs SA: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ టైటిల్ పోరాటం ముగిసింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ను దురదృష్టం వెంటాడింది. సౌతాఫ్రికాతో శుక్రవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో బాబర్ సేన ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. 'అంపైర్స్ కాల్'అనే నిబంధన దాయాదీ కొంపముంచింది.
బౌలర్లకు శాపంగా మారిన ఈ రూల్ను మార్చాలనే డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తోంది. పాకిస్థాన్ తాజా పరాజయంతో ఈ వాదన మరింత బలమైంది. 271 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. అంపైర్స్ కాల్ అనే నిబంధనతోనే ఓటమిని తప్పించుకుంది. ఈ లక్ష్యచేధనలో సౌతాఫ్రికా 260 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది.

దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. పాకిస్థాన్ విజయానికి ఒక్క వికెట్ అవసరం కాగా.. సౌతాఫ్రికా గెలుపునకు 11 పరుగులు చేయాలి. మరోవైపు పాకిస్థాన్ పేసర్లు నిప్పులు చెరుగుతుండటంతో సౌతాఫ్రికా ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. ఇక్కడే పాకిస్థాన్ను దురదృష్టం వెక్కిరిస్తే.. సౌతాఫ్రికాకు అదృష్టం కలిసొచ్చింది.
హ్యారీస్ రౌఫ్ వేసిన 46వ ఓవర్ చివరి బంతికి షంసీ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో పాకిస్థాన్ ఆటగాళ్లు గట్టి అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. వెంటనే బాబర్ ఆజామ్ రివ్యూ తీసుకోగా.. రిప్లేలో అంపైర్స్ కాల్గా తేలింది. బాల్ ట్రాకింగ్లో బంతి లెగ్ స్టంప్ను లైట్గా ముద్దాడటంతో థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి నాటౌట్ ఇచ్చాడు.
బాల్ ట్రాకింగ్లో 50 శాతం కంటే తక్కువ లెగ్/ఆఫ్ స్టంప్ను బంతిని తాకితే అంపైర్స్ కాల్గా పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఫీల్డ్ అంపైర్ ఇచ్చినదే తుది నిర్ణయం.
ఒకవేళ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చి ఉంటే షంసీ పెవిలియన్ చేరేవాడు. అప్పుడు సౌతాఫ్రికా 263 పరుగులకే ఆలౌటయ్యేది. దాంతో పాకిస్థాన్ 7 పరుగుల తేడాతో విజయం సాధించేది. కానీ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ఫలితం తారుమారైంది. ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న షంసీ.. కేశవ్ మహరాజ్కు సహకరించడంతో సౌతాఫ్రికా విజయం లాంఛనమైంది.
మ్యాచ్ ఫలితాలను తారు మారు చేస్తున్న అంపైర్ కాల్స్ నిబంధనను తొలగించాలని సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. బ్యాటింగ్ ఫేవర్గా మారిన క్రికెట్లో బౌలర్లకు నష్టం చేస్తున్న అంపైర్ కాల్స్ రూల్ను తొలగించాలని కోరుతున్నారు. బాల్ ట్రాకింగ్లో బంతి వికెట్లకు తాకితే ఔటిచ్చేయాలని, ముద్దాడినా.. తక్కువ శాతం తగులుతున్నా.. బౌలర్లకు అనుకూలంగా ఔటివ్వాలని సూచిస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 46.4 ఓవర్లలో 270 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(65 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 50), సౌద్ షకీల్(52 బంతుల్లో 7 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లకు 271 పరుగులు చేసింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్(93 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 91) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు.