RCB vs CSK: అంపైర్ నితిన్ మీనన్ ఘోర తప్పిదం.. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) విజయవకాశాలను దెబ్బతీసింది. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సీఎస్కే 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా చేజార్చుకుంది. మరోసారి యశ్ దయాల్ సంచలన బౌలింగ్తో ఆర్సీబీకి చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. అయితే ఈ మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ చేసిన తప్పిదం.. సీఎస్కే ఓటమిని శాసించింది. అంపైర్ తప్పిదం కారణంగా డెవాల్డ్ బ్రెవిస్ ఎల్బీ విషయంలో మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది.
అసలేం జరిగిదంటే..?
214 పరుగుల భారీ లక్ష్యచేధనలో ఆయుషే మాత్రే, జడేజా విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. మూడో వికెట్కు 114 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. అయితే ఈ భారీ భాగస్వామ్యాన్ని 17వ ఓవర్లో లుంగిడి ఎంగిడి విడదీసాడు. సెంచరీకి చేరువైన ఆయుష్ మాత్రేను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చిన అతను.. ఆ మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్(0)ను వికెట్లు ముందు బోల్తా కొట్టించాడు. ఆర్సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ నితిన్ మీనన్ ఔటిచ్చాడు.

రివ్యూకు నిరాకరణ..
ఏమైందో తెలియదు కానీ డీఆర్ఎస్ టైమర్ స్క్రీన్పై కనిపించలేదు. దాంతో రివ్యూ కోరే విషయంలో జడేజాతో బ్రెవిస్ టైమ్ వృథా చేశాడు. చివరకు రివ్యూ కోరగా.. సమయం ముగిసిందని అంపైర్ నితిన్ నిరాకరించాడు. జడేజా అంపైర్తో వాగ్వాదానికి దిగినా పట్టించుకోలేదు. నిరాశగా పెవిలియన్ చేరిన డెవాల్డ్ బ్రెవిస్.. ఫోర్త్ అంపైర్పై అసహనం వ్యక్తం చేశాడు. రిప్లేలో బంతి ఐదో స్టంప్ను మిస్సైనట్లు కనిపించింది. ఇది చూసి నితిన్ అలా ఎలా ఔటిచ్చాడని కామెంటేటర్లతో పాటు అభిమానులు అవాక్కయ్యారు. డెవాల్డ్ బ్రెవిస్.. జడేజాను సంప్రదించకుండా రివ్యూ తీసుకోవాల్సిందని కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు. రెండు రివ్యూలున్నా సీఎస్కే ఉపయోగించుకోలేక మూల్యం చెల్లించుకుందన్నారు.
ఇదే తప్పిదం ఫైనల్లో జరిగితే..?
డెవాల్డ్ బ్రెవిస్ ఔటవ్వకుండా ఉండి ఉంటే.. జడేజాతో కలిసి అతను మ్యాచ్ ముగించేవాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇది సాధారణ లీగ్ మ్యాచ్ కాబట్టి అంపైర్ తప్పిదాన్ని పట్టించుకోవడం లేదని, అదే ఫైనల్లో జరిగితే ఇలానే సైలెంట్గా ఉండేవారా? అని సీఎస్కే ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ నుంచి నితిన్ మీనన్ను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా నితిన్ మీనన్ పక్షపాతంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. మరికొందరు అభిమానులు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. లీగ్ దగ్గర పడుతున్నా కొద్దీ అంపైర్ల నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.