
మెల్బోర్న్: అడిలైడ్ ఘోర పరాజయాన్ని మరిపిస్తూ బాక్సింగ్ డే టెస్ట్లో చెలరేగుతున్న భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. సోమవారం మూడో రోజు ఆటలో బౌలింగ్ చేస్తూ స్టార్ పేసర్ ఉమేశ్ యాదవ్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో ఆదిలోనే ఆ జట్టు ఓపెనర్ జో బర్న్స్(4) క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చిన ఉమేశ్.. తన నాలుగో ఓవర్లో కాలిపిక్క గాయంతో బాధపడ్డాడు. వెంటనే టీమ్ మెడికల్ టీమ్ ఉమేశ్ను పరీక్షించి మైదానం బయటకు తీసుకెళ్లారు. స్కాన్స్ కోసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. దాంతో రహానే సేన ఉమేశ్ యాదవ్ సేవలను కోల్పోయింది.
జస్ప్రీత్ బుమ్రా, అరంగేట్ర పేసర్ మహ్మద్ సిరాజ్, స్పిన్నర్లు రవీంద్ర జడేజా, స్టీవ్ స్మిత్లే బౌలింగ్ చేస్తున్నారు. ఐదుగురు బౌలర్ల వ్యూహాం ఉమేశ్ గాయం నేపథ్యంలో కలిసొచ్చింది. ఇక ఇప్పటికే స్టార్ మహ్మద్ షమీ సేవలను కోల్పోయిన భారత్కు ఉమేశ్ గాయం కొంత కలవరపాటు గురిచేస్తుంది. ప్రస్తుతానికైతే ఉమేశ్ గాయం తీవ్రతపై క్లారిటీ లేనప్పటికీ.. అతను దూరమైతే తదుపరి మ్యాచ్ల్లో కష్టాలు తప్పవు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే బాక్సిండే టెస్ట్పై భారత్ పట్టు బిగించింది. టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. జడేజా రెండు వికెట్లు తీయగా.. బుమ్రా, సిరాజ్, ఉమేశ్, అశ్విన్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో కామెరూన్ గ్రీన్(9 బ్యాటింగ్) కమిన్స్(11 బ్యాటింగ్) ఉన్నారు. కెప్టెన్ రహానే సెంచరీతో భారత ఫస్ట్ ఇన్నింగ్స్ 326 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.