స్నేహితుడి ఉద్యోగం ఇస్తే..
నాగ్పుర్కు చెందిన శైలేశ్ థాక్రే.. ఉమేశ్ యాదవ్కు చాలా కాలంగా తెలుసు. శైలేశ్కు ఉద్యోగం లేకపోవడంతో ఉమేశ్ టీమిండియా జట్టుకు ఎంపికైన తర్వాత.. 2014 జులైలో స్నేహితుడిని తన మేనేజర్గా నియమించుకున్నాడు. మొదట్లో ఎంతో నమ్మకంగా ఉన్న శైలేశ్.. కొంతకాలం తర్వాత క్రికెటర్ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకోవడం మొదలుపెట్టాడు. ఉమేశ్ బ్యాంకు ఖాతా, ఆదాయపు పన్ను ఇలా అన్నీ అతనే చూసుకునేవాడు.
భూమి కోసమని..
ఈ క్రమంలోనే తాను నాగ్పుర్లో భూమి కొనుగోలు చేయాలనుకుంటున్నానని, ఎక్కడైనా ఉంటే చూడమని ఉమేశ్ .. స్నేహితుడైన మేనేజర్కు చెప్పాడు. దీంతో నాగ్పుర్లోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ ప్లాట్ చూపించిన శైలేశ్.. రూ.44లక్షలకే దాన్ని ఇప్పిస్తానని నమ్మించాడు. స్నేహితుడిపై నమ్మకంతో క్రికెటర్ ఆ మొత్తాన్ని అతని ఖాతాలో జమ చేశాడు. కానీ, ఉమేశ్ను మోసగించిన శైలేశ్.. ఆ ప్లాట్ను తన పేరుమీదే రిజిస్టర్ చేయించుకున్నాడు.
మోసాన్ని గ్రహించి..
ఈ విషయం గురించి ఆలస్యంగా తెలుసుకున్న ఉమేశ్ యాదవ్ అతన్ని నిలదీయగా.. ఎదురు తిరిగాడు. ప్లాట్ను తన పేరుమీదకు బదలాయించేందుకు శైలేశ్ అంగీకరించలేదు. డబ్బు కూడా తిరిగి ఇవ్వనని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన క్రికెటర్ పోలీసులను ఆశ్రయించాడు. ఉమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆస్ట్రేలియాతో సిరీస్కు..
భారత టెస్ట్ టీమ్కు మాత్రమే పరిమితమైన ఉమేశ్ యాదవ్.. తుది జట్టులో అవకాశాలు అందుకోలేకపోతున్నాడు. కుర్రాళ్లు సత్తా చాటుతుండటంతో అతను చాలా మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమయ్యాడు. ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో మాత్రం అతను బరిలోకి దిగాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని తొలి రెండు మ్యాచ్లకు ఎంపిక చేసిన జట్టులో ఉమేశ్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. అయితే అతనికి జయదేవ్ ఉనాద్కత్తో పోటీ నెలకొంది.